Ram Mohan Naidu: పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది మహారాష్ట్రలోని ఎన్సీపీ పార్టీ. విమాన ప్రమాదంలో మరణించిన అజిత్ పవార్ ఘటనకు సంబంధించి దర్యాప్తు పూర్తయ్యే వరకు మంత్రితోపాటు డీజీసీఏ అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఇంతకీ అసలేం జరిగింది?
చిక్కుల్లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విమాన ప్రమాదంలో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించారు. ఆ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ పవార్.. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు డీజీసీఏ అధికారులు రాజీనామా చేయాలని కోరారు.
తన మామ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తాను నేరుగా ఆరోపణలు చేయలేదన్నారు. బారామతిలో కూలిన లియర్ జెట్ విమానం VSR సంస్థకు చెందినది తెలిపారు. ఆయనతో సదరు మంత్రికి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని, దీనివల్ల దర్యాప్తు మీద ప్రభావం చూపుతుందన్నారు.
మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎన్సీపీ డిమాండ్
అజిత్ పవార్ ప్రయాణించిన విమానం వీఎస్ఆర్ గ్రూపుకు చెందినది. ఇటీవల వీఎస్ఆర్ గ్రూప్ యజమాని వీకే సింగ్ కుమారుడు రోహిత్ సింగ్ వివాహానికి హాజరయ్యారట కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. అలాగే మహారాష్ట్రకు చెందిన కొంతమంది మాజీ మంత్రులు, ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు టీడీపీ ఎంపీలు హాజరయ్యారని సమాచారం.
దర్యాప్తు కొనసాగుతుండగా వివాహానికి హాజరుకావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు ఎస్పీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్. విచారణ నిష్పక్షపాతంగా జరగాలన్నారు. ఈ ఘటనపై రోహిత్ పవార్ సందేహాలు తనకు ఉన్నాయన్న శరద్పవార్ కుమార్తె ఎంపీ సుప్రియ సులే అన్నట్లు తెలుస్తోంది. రోహిత్ పవార్కు సెక్యూరిటీ కల్పించాలని సుప్రియ సులే డిమాండ్ చేశారు.అయితే రోహిత్ పవార్ వ్యాఖ్యలపై అధికారికంగా స్పందించలేదు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.
ALSO READ: ఏఐ సదస్సులో ప్రధాని చేతికి బాగ్ వాచ్.. ధర తెలిస్తే షాక్!