Sharad Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్సీపీ విలీనంపై జోరుగా చర్చ మొదలైంది. ఇప్పటికే పలు నేతలు ఎన్సీపీ విలీనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎన్సీపీ(ఎస్పీ) అధినేత, అజిత్ పవార్ బాబాయ్ శరాద్ పవార్.. ఎన్సీపీ విలీనంపై స్పందించారు. ఎన్సీపీ రెండు వర్గాల విలీనానికి అజిత్ అనుకూలంగా ఉండేవారని గుర్తుచేసుకున్నారు. విలీనంపై చర్చలు జరిగాయని, ఫిబ్రవరి 12న రెండు వర్గాలు కలిసిపోవాలని అజిత్ కోరుకున్నారని సీనియర్ పవార్ చెప్పారు. దురదృష్టవశాత్తూ విమాన ప్రమాదంతో ఆ చర్చలు ఆగిపోయాయన్నారు.
అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదని శరద్ పవార్ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి అసలు తనకు ఎలాంటి అవగాహన లేదన్నారు. ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరె ఆ పార్టీలో సీనియర్ నాయకులని, వారే భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుంటారని స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో అధికారిక కూటమిలో అజిత్ పవార్ ఎన్సీపీ భాగంగా ఉంది. అజిత్ పవార్ స్థానంలో ఆయన సతీమణి సునేత్రాకు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఇవాళ ఆమె ప్రమాణం చేస్తే ఆ పదవిని చేపట్టిన తొలి మహిళగా నిలుస్తారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఎన్సీపీ (ఎస్పీ) నేత శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. బారామతిలో పార్టీ నేతలతో శరద్ పవార్ సమావేశం అయ్యారు.
Also Read: ఎన్సీపీకి అజిత్ పవార్ వారసులెవరు? భార్య లేకుంటే కొడుకా? సొంతగూటుకి వెళ్తారా?
అజిత్ పవార్ మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు మారుతున్నాయి. ఆయన పెద్ద కుమారుడు పార్థ్ పవార్ కు రాజ్యసభ సీటు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన తల్లి సునేత్రా పవర్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నట్లు ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. సునేత్రా స్థానాన్ని పార్థ్ కు కేటాయిస్తారని సమాచారం. పార్థ్ 2019 లోక్సభ ఎన్నికల్లో మావల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగా ఓడిపోయారు.