Nitish Kumar: బిహార్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా ఆ రాష్ట్ర రాజకీయాలను తనదైన శైలిలో శాసిస్తున్న నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మార్చి 1వ తేదీన ఆయన 75వ పుట్టినరోజు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. రాష్ట్ర పగ్గాలను మిత్రపక్షమైన బీజేపీకి అప్పగించాలని కూటమి వ్యూహరచన చేస్తోంది. దీనివల్ల బిహార్ చరిత్రలో తొలిసారిగా బీజేపీకి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమం కానుంది.
జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఇప్పటికే రాజ్యసభ నామినేషన్ పత్రాలపై సంతకం చేసినట్లు సమాచారం. మార్చి 5వ తేదీన ఆయన నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉండగా.. మార్చి 16వ తేదీ తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి అధికారికంగా రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకు పాట్నాను వదిలి వెళ్లడానికి విముఖత చూపిన నితీష్, ఇప్పుడు కేంద్రంలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. బీజేపీ నాయకత్వం కూడా నితీష్ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో తమ సొంత ముఖ్యమంత్రిని నియమించుకోవాలని గట్టిగా యోచిస్తోంది.
బిహార్లో బీజేపీ తన బలాన్ని మరింత పెంచుకోవాలని.. సొంతంగా ప్రభుత్వాన్ని నడపాలని చాలా కాలంగా ఆశిస్తోంది. నితీష్ వయస్సు 75 ఏళ్లు నిండటంతో ఆయనను గౌరవప్రదంగా కేంద్రానికి పంపి రాష్ట్ర పగ్గాలను చేపట్టాలని బీజేపీ తన వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీనికి సంబంధించి ఇరు పార్టీల మధ్య ఇప్పటికే ఒక అవగాహన కుదిరినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నితీష్ తప్పుకున్న తర్వాత ఎన్డీయే పక్షాల మద్దతుతో బీజేపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
నితీష్ కుమార్ బిహార్ రాజకీయాల్లో ఒక అజేయ శక్తిగా ఎదిగి పదిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆయన కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తే బీహార్లో బీజేపీ తన పట్టును ఏ విధంగా ప్రదర్శిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో నితీష్ రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. నితీష్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం బిహార్ భవిష్యత్తును ఏ విధంగా మారుస్తుందో త్వరలోనే స్పష్టత రానుంది.
మరోవైపు ఈ పరిణామాలపై జేడీయూ శ్రేణుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా తమ నాయకుడి నీడలో ఉన్న పార్టీ.. ఇప్పుడు ఆయన లేని లోటును ఎలా భర్తీ చేస్తుందనే ఆందోళన వారిలో ఉంది. అయితే బీజేపీ మాత్రం రాష్ట్రంలో సుస్థిర పాలన అందిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.
Read Also: ఏపీ మండలిలో లడ్డూ రగడ.. మండలి చైర్మన్ పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు..!