Onion Heatstroke: యావత్ దేశం అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న వేళ.. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చను లేవనెత్తాయి. జేబులో ఉల్లిపాయ ఉంచుకుంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చన్న మాటలు.. నెట్టింట ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. నిజంగానే ఉల్లిగడ్డతో వడదెబ్బను అడ్డుకోవచ్చా? అని చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆరోగ్య నిపుణులు సైతం కేంద్రమంత్రి వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. అందులో నిజానిజాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మధ్యప్రదేశ్లోని శివపురిలో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొన్న కేంద్రమంత్రి సింధియా.. ఎండల తీవ్రత గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మే, జూన్ నెలల్లో 51 డిగ్రీల ఎండ ఉన్నా నేను నా కారులో ఏసీ వాడను. నాది చంబల్ చర్మం. అందుకే ఎండను తట్టుకోగలను’ అని ఆయన పేర్కొన్నారు.
#WATCH | Shivpuri, Madhya Pradesh: Union Minister Jyotiraditya Scindia says, "I don't use air conditioning in my car, nor do I sit in an air-conditioned environment. And when people ask me, even in the 51-degree heat of May and June, I say, 'This is Chambal skin.' And let me tell… pic.twitter.com/7sADRwxUef
— ANI (@ANI) April 27, 2026
తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ సభలో ఉల్లిపాయ చిట్కా గురించి కేంద్రమంత్రి సింధియా చెప్పుకొచ్చారు. తను కుర్తా జేబులో నుండి ఒక ఉల్లిపాయ తీసి చూపిస్తూ.. ‘జేబులో ఉల్లిపాయ పెట్టుకోండి. మీకు ఏమీ కాదు’ అని ప్రజలకు సూచించారు. ప్రస్తుత కాలంలో అందరూ చేతిలో మొబైల్ ఫోన్లు పట్టుకుని తిరుగుతున్నారని.. కమ్యూనికేషన్ మంత్రిగా తాను మాత్రం ఉల్లిపాయను వెంట ఉంచుకుంటున్నానని చమత్కరించారు. మన పూర్వీకులు పాటించిన ఇటువంటి ఆయుర్వేద చిట్కాలను మర్చిపోకూడదని ఆయన పేర్కొన్నారు.
కేంద్రమంత్రి సింధియా చెప్పిన ఉల్లిపాయ చిట్కా వైరల్ అవ్వడంతో వైద్య నిపుణులు.. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ‘ఉల్లిగడ్డతో వడదెబ్బకు చెక్’ అనే అంశంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. జేబులో ఉల్లిపాయ పెట్టుకోవడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పేర్కొంటున్నారు. ఉల్లిపాయ కేవలం జేబులో ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: బాటమ్ మౌంటెడ్ ఫ్రిడ్జ్లు.. సాధారణ వాటితో పోలిస్తే.. వీటివల్ల ఎన్ని లాభాలో తెలుసా?
ఉల్లిపాయను జేబులో పెట్టుకోవడం కంటే.. పచ్చిగా తినడం వల్ల శరీరానికి చలవ చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అందులో ఉండే నీటి శాతం, పోషకాలు.. శరీరం హైడ్రేటెడ్గా ఉండటానికి సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే తగినంత నీరు తాగడం, ఎండలో వెళ్లేటప్పుడు గొడుగు వాడటం, తేలికపాటి ఆహారం తీసుకోవడం వంటి సైన్స్ ఆధారిత పద్ధతులే ఉత్తమమని సూచిస్తున్నారు. మెుత్తం మీద.. కేంద్రమంత్రి సూచించిన ఆయుర్వేద చిట్కాను కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు ఇలాంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించవద్దని పేర్కొంటున్నారు.
Also Read: ఏసీ, కూలర్ ఎంత వాడినా.. సగం కరెంటు బిల్లే రావాలా? ఈ 4 పనులు చేస్తే సరి!