Bharat Ratna For Kanshi Ram: బహుజన చైతన్యానికి మార్గదర్శి సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప యోధుడు కాన్షీ రామ్కు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ఆదివారం ఒక బహిరంగ లేఖ రాశారు. కాన్షీ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చేసిన అపారమైన కృషిని వారసత్వాన్ని రాహుల్ గాంధీ లేఖలో గుర్తు చేశారు. కోట్లాది మంది బహుజనులకు హక్కులు భాగస్వామ్యం ఆత్మగౌరవం వైపు మార్గాన్ని చూపించిన కాన్షీ రామ్ను సత్కరించడం ద్వారా మొత్తం సామాజిక ఉద్యమానికి తగిన గౌరవం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
కాన్షీ రామ్ భారత రాజకీయాల స్వభావాన్ని పూర్తిగా మార్చివేశారని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. తన ఉద్యమాల ద్వారా బహుజనులు పేదలలో రాజకీయ అవగాహన పెంపొందించారని కొనియాడారు. వారి ఓటు వాయిస్ ప్రాతినిధ్యం ఎంత కీలకమో గుర్తు చేస్తూ సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టారని వివరించారు. ఆయన స్ఫూర్తితోనే ప్రజా జీవితంలోకి ప్రవేశించాలని ఎప్పుడూ ఆలోచించని అట్టడుగు వర్గాల ప్రజలు నేడు న్యాయం సమానత్వం కోసం రాజకీయాలను ఒక మార్గంగా ఎంచుకుంటున్నారని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సామాన్యులకు చేరువ చేయడం ద్వారా భారత ప్రజాస్వామ్య పునాదులను ఆయన మరింత బలోపేతం చేశారని ప్రశంసించారు.
దళిత మేధావులు నాయకులు కార్యకర్తలు చాలా కాలంగా కాన్షీ రామ్కు భారతరత్న ఇవ్వాలని కోరుతున్న విషయాన్ని రాహుల్ గుర్తు చేశారు. ఇటీవల లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో కూడా ఈ డిమాండ్ బలంగా వినిపించిందని తెలిపారు. సమాజంలోని అట్టడుగు వర్గాల సాధికారత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడిని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. మరణానంతరం ఆయనకు ఈ గౌరవాన్ని అందించడం ద్వారా లక్షలాది మంది ప్రజల ఆకాంక్షలను గౌరవించినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఈ అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని ఆశిస్తున్నట్లు రాహుల్ గాంధీ తన లేఖలో వెల్లడించారు.
Read Also: Harish Rao: ‘కాంగ్రెస్ సర్కార్కు.. అంగన్వాడీల సమస్యలు పట్టవా?’.. హరీశ్ రావు ఫైర్