Kanha Group IT Raids: ఇటీవల వచ్చిన ఓ సినిమాలో.. ఇంటి గోడలో, పై కప్పు, బాత్రూమ్ లో భారీగా డబ్బు, బంగారం దాచేస్తాడు విలన్. ఐటీ అధికారి అయిన హీరో వాటిని పట్టుకుంటాడు. ఇదే సీన్ రాజస్థాన్ లోని జైపూర్ లో రిపీట్ అయింది. ఓ వ్యాపారి కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఓ స్ట్రాంగ్రూమ్ను దాచిపెట్టి, దానికి ఓ సీక్రెట్ గోడను కట్టించాడు. ఎవరో ఓ వ్యక్తి ఈ సమాచారాన్ని ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు లీక్ చేశాడు.
రాజస్థాన్లోని కన్హా గ్రూప్పై ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేశారు. ఈ సంస్థకు చెందిన 33 ప్రాంతాల్లో ఒకేసారి ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భారీగా పన్ను ఎగవేతకు సంబంధించిన కేసులో.. వ్యాపారి ఇల్లు, సంస్థల నుంచి పెద్ద ఎత్తున డబ్బు, బంగారం, విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
కన్హా గ్రూప్ కు చెందిన సంస్థలపై ఐటీ అధికారులు ఆరు నగరాల్లోని 33 ప్రదేశాలలో ఒకేసారి దాడులు ప్రారంభించారు. జైపూర్లోని 26 ప్రదేశాలలో సోదాలు చేశారు. ఉదయపూర్లోని రెండు ప్రాంతాలు, శ్రీగంగానగర్, కోట, కరౌలి, హిందౌన్, ముంబైలలో ఒక్కొక్క చోట ఐటీ బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి.
2008లో నట్వర్ లాల్ శారదా స్థాపించిన కన్హా గ్రూప్.. జైపూర్కు చెందిన ప్రముఖ ఫుడ్, డ్రింక్స్ సంస్థ. ఇది స్వీట్లు, నమ్కీన్లు, బేకరీ ఉత్పత్తులకు ప్రసిద్ధి.
ఐటీ అధికారుల సోదాల్లో రూ. 100 కోట్లకు పైగా పన్ను ఎగవేత డబ్బును లగ్జరీ హోటళ్లలో పెట్టుబడి పెట్టినట్లు బయటపడింది. జైపూర్లోని రెండు విలాసవంతమైన ఫైవ్-స్టార్ హోటల్లు, హోటల్ తాజ్ కుందన్ వాన్ కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. కన్హా సంస్థల అధినేత ఇల్లు, కార్యాలయంలో పెద్ద సంఖ్యలో అనుమానాస్పద పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంస్థల యజమాని ఇంట్లో ఓ రహస్య గదిలో.. సీక్రెట్ వాల్ ను అధికారులు గుర్తించారు. దీని బద్దలు కొట్టగా భారీగా బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. ఈ బంగారు ఆభరణాల విలువ భారీగా ఉంటుందని అధికారులు అంటున్నారు.
Also Read: హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు.. హోటళ్ల ఛైర్మన్లు, డైరెక్టర్ ఇళ్లలో సోదాలు
కన్హా గ్రూప్కు చెందిన 10కి పైగా బ్యాంక్ లాకర్లను ఐటీ శాఖ కనుగొంది. ఈ లాకర్లలో కోట్లాది రూపాయల విలువైన వివాదాస్పద ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్, భారీగా బంగారం ఉండవచ్చునని భావిస్తున్నారు.