IT Raids in Hyderabad: హైదరాబాద్ సిటీలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ విషయంలో తెలియక చాలామంది బడాబాబులు హడలిపోతున్నారు. ఈ మధ్యకాలంలో లిక్కర్ కేసులో బంగారు కొనుగోలు చేసిన షాపులు, ఓనర్ల ఇళ్లపై సోదాలు చేశారు. తాజాగా హైదరాబాద్లో ఫేమస్ హోటళ్ల ఛైర్మన్లు, వాటి డైరెక్టర్ల ఇళ్లపై సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్లో ఫేమస్ హోటళ్లపై ఐటీ సోదాలు
హైదరాబాద్ సిటీలోని ఫేమస్ బిర్యానీ రెస్టారెంట్ చైన్లపై ఐటీ సోదాలు చేపట్టింది. ఏకకాలంలో 15 చోట్ల సోదాలు చేస్తున్న తెలుస్తోంది. భారీ స్థాయిలో పన్ను ఎగవేత ఆరోపణలతో సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. కోట్ల రూపాయల విలువైన అమ్మకాల వివరాలను హోటళ్ల నిర్వాహకులు గోప్యంగా ఉంచినట్టు అనుమానిస్తున్నారట ఐటీ అధికారులు.
వాటిలో పిస్తా హౌస్, షా గౌస్, మెహ్ఫిల్ గ్రూప్కు చెందిన కార్యాలయాలు, వాటికి సంబంధించిన యజమానుల నివాసాలు, ఇతర సంబంధిత ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. ఈ మూడు బ్రాండ్లకు చెందిన పలు యూనిట్లు, శాఖలు, అకౌంటింగ్ సెక్షన్లు, గిడ్డంగులు, నిర్వాహకులకు చెందిన ఇళ్లపై సోదాలు జరుగుతున్నాయి.
హోటళ్ల ఛైర్మన్లు, డైరెక్టర్ ఇళ్లలో సోదాలు
మెహ్ఫిల్ రెస్టారెంట్కి సిటీలో 15 బ్రాంచీలు ఉన్నాయి. అదనంగా యుఏఈలో బ్రాంచ్లు ఉన్నాయి. పిస్తా హౌస్కి విదేశాల్లో కలిపి మొత్తం 44 స్టోర్ లు ఉన్నాయి. గచ్చిబౌలి, టోలీచౌక్, ఓల్డ్ సిటీ తదితర ప్రాంతాల్లో షా గౌజ్ హోటళ్లు ఉన్నాయి. ప్రధానంగా ఆయా హోటళ్ల హెడ్ ఆఫీసులు, ఛైర్మన్లు, డైరెక్టర్లు ఇళ్లు ఉన్నాయి.
రాజేంద్రనగర్ లోని పిస్తా హౌస్ యజమాని మాజిద్ ఇంట్లో ఉదయం ఐదు గంటల నుంచి సోదాలు చేస్తున్నారు అధికారులు. దీనికితోడు శాలిబండలోని పిస్తా హౌస్ ప్రధాన బ్రాండ్లో ఫైళ్లను తనిఖీలు చేస్తున్నారు. ఈ మూడు హోటళ్లు ఏటా వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. కాకపోతే వారి నుంచి పన్ను వసూలు కాలేదని తేలింది.
ALSO READ: ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం.. అభ్యర్థి కోసం బీఆర్ఎస్ వెతుకులాట
ఈ మధ్యకాలంలో ఆయా హోటళ్లు ఆన్లైన్ ఆర్డర్లతోపాటు క్యాష్ ట్రాన్స్యాక్షన్ అధికంగా ఉండడంతో పన్ను ఎగవేతకు పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేశారు. మరి కొన్నిచోట్ల కూడా సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ మొత్తంలో నగదు లభించినట్టు వార్తలు వస్తున్నాయి. సోదాల తర్వాత దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది.