కేవలం 65 రోజులు కలిసి ఉన్న ఒక జంట మధ్య 13 ఏళ్లుగా సాగుతున్న సుదీర్ఘ న్యాయపోరాటానికి సుప్రీంకోర్టు స్వస్తి పలికింది. ‘ఆ ఇద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టిన వారు కాకపోవచ్చు’ అని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తమకున్న అసాధారణ అధికారాలను ఉపయోగించి వారికి విడాకులు మంజూరు చేసింది. జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ వివాదానికి శాశ్వత ముగింపునిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ జంట 2012 జనవరి 28న వివాహం చేసుకున్నారు. అయితే.. పెళ్లయిన 65 రోజులకే భర్త, అతని కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగా భార్య అత్తారింటిని వీడింది. అప్పటి నుంచి ఈ జంట గత 13 ఏళ్లుగా విడివిడిగానే ఉంటున్నారు. కానీ, వీరి మధ్య విభేదాలు మాత్రం ఢిల్లీ, అలహాబాద్, ఘజియాబాద్, లక్నో వంటి నగరాల్లోని వివిధ కోర్టుల్లో ఏకంగా 40కి పైగా క్రిమినల్, సివిల్ కేసులకు దారితీశాయి. ఒకరిపై ఒకరు పగ తీర్చుకునే క్రమంలో దశాబ్ద కాలం పాటు న్యాయ వ్యవస్థను చుట్టూ తిరిగారు.
కోర్టు కీలక పరిశీలనలు..
ఈ వివాదంలో భార్య ఎటువంటి భరణం ఆశించకుండా విడాకులు కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే భర్త మాత్రం విడాకులకు సమ్మతించలేదు. తన జీవితాన్ని ఆమె నాశనం చేసిందని, కోర్టులను తప్పుదోవ పట్టించిందని అతను వాదించాడు. భర్త అంగీకారం లేకపోయినప్పటికీ.. ఆ బంధం తిరిగి కలవలేనంతగా దెబ్బతిన్నదని భావించిన కోర్టు, విడాకులు మంజూరు చేయడానికి అతని సమ్మతి అవసరం లేదని తేల్చి చెప్పింది. ‘నేటి తరం జంటలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకుంటారు. కానీ, దశాబ్ద కాలంగా పేరుకుపోయిన చేదు జ్ఞాపకాలను మర్చిపోయి మళ్లీ కలిసి జీవించడం అసాధ్యం’ అని కోర్టు పేర్కొంది.
వ్యవస్థ దుర్వినియోగంపై హెచ్చరిక..
వైవాహిక వివాదాల్లో కోర్టులను వ్యక్తిగత కక్షలు తీర్చుకునే మార్చుకోవడంపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు న్యాయ వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని మండిపడింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి టెక్నాలజీని వాడుకుని తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం పెరిగిపోతోందని కోర్టు హెచ్చరించింది. క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టుల దాకా వెళ్లడం వల్ల దంపతులు తిరిగి కలిసే అవకాశాలు పూర్తిగా మూసుకుపోతున్నాయని అభిప్రాయపడింది.
ముందుగా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, పోలీస్ స్టేషన్ల దాకా వెళ్లే ముందే రాజీ ప్రయత్నాలు జరగాలని కోర్టు సూచించింది. చివరిగా, భార్యాభర్తల మధ్య ఉన్న అన్ని పెండింగ్ కేసులను కొట్టివేస్తూ.. ఇకపై ఒకరిపై ఒకరు కొత్త కేసులు వేయకూడదని నిరోధించింది. అయితే, తప్పుడు సాక్ష్యాలు ఇచ్చినట్లు ఉన్న దరఖాస్తులను మాత్రం విచారించాలని కోర్టు ఆదేశించింది. న్యాయ వ్యవస్థ సమయాన్ని వృధా చేసినందుకు ఇద్దరికీ చెరో రూ.10,000 జరిమానా విధించి ఈ వివాదానికి పులిస్టాప్ చెప్పింది.