Ajit Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూయడం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే రాజకీయ ప్రముఖులు, వివిధ రాష్ట్రాల మంత్రులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. బారామతికి ప్రాతినిధ్యం వహిస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన అజిత్ పవార్ అకాల మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద శూన్యాన్ని మిగిల్చింది.
శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది..
శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ.. అజిత్ పవార్ మరణం హృదయ విదారకమని పేర్కొన్నారు. రాజకీయ విభేదాలు పక్కన పెడితే, పని పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత అద్భుతమని ఆమె కొనియాడారు. పవార్ సాహెబ్ (శరద్ పవార్), సుప్రియా సూలే, సునేత్ర పవార్ సహా వారి కుటుంబ సభ్యులకు, బారామతి ప్రజలకు ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
డీకే శివకుమార్ కర్ణాటక డిప్యూటీ సీఎం
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ అకాల మరణం ప్రజా జీవితానికి తీరని లోటని ఆయన అన్నారు. ఆయన అనుభవం, దృఢ సంకల్పం మహారాష్ట్ర ప్రగతికి ఎంతో దోహదపడ్డాయని, ఈ క్లిష్ట సమయంలో ఆయన మద్దతుదారులకు, కుటుంబానికి ధైర్యం కలగాలని ఆయన ఆకాంక్షించారు.
మంత్రి సీతక్క సంతాపం
తెలంగాణ మంత్రి సీతక్క తన సంతాపాన్ని తెలియజేస్తూ, అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని నష్టమని పేర్కొన్నారు. ప్రజాసేవలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అజిత్ పవార్ అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆమె కోరారు.
రాజ్ నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ.. అజిత్ పవార్ సుదీర్ఘ ప్రజా జీవితం అంతా మహారాష్ట్ర అభివృద్ధి కోసమే సాగిందని కొనియాడారు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న కరుణ, అచంచలమైన అంకితభావం ఎందరికో ఆదర్శమని పేర్కొన్నారు. దేశం ఒక సమర్థుడైన నాయకుడిని కోల్పోయిందని చెబుతూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
ప్రియాంక గాంధీ
మహారాష్ట్రలో జరిగిన విషాదకరమైన విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఇతరులు మరణంపై స్పిందించిన ప్రియాంక గాంధీ. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలి శరద్ పవార్, సుప్రియా సులే, వారి మొత్తం కుటుంబం, అజిత్ పవార్ మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మల్లిఖార్జున ఖర్గే
విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారనే వార్త తీవ్ర దిగ్భ్రాంతిని, అంతులేని వేదనను కలిగించింది. ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ఉన్న ఒక నాయకుడిని అకాలంగా కోల్పోవడం బాధగా ఉంది. ఈ క్లిష్ట సమయంలో దుఃఖంలో మునిగిపోయిన కుటుంబం అనుభవిస్తున్న అపారమైన బాధను వర్ణించడానికి మాటలు సరిపోవు. పవార్ కుటుంబ సభ్యులకు, ఆయన మద్దతుదారులకు మరియు శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మహారాష్ట్ర ప్రజలకు వివిధ రాజ్యాంగ పదవులలో సేవలందించిన అజిత్ పవార్, తన ప్రజల పట్ల బాధ్యతలను చిత్తశుద్ధితో, దక్షతతో నిర్వర్తించిన ఒక అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడిగా గుర్తుండిపోతారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సంతాపం తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ
అజిత్ పవార్ అకాల మరణం చాలా దిగ్భ్రాంతికరం, విచారకరం. అజిత్ పవార్ ప్రజానాయకుడు, ఆయనకు క్షేత్రస్థాయిలో బలమైన సంబంధాలు ఉండేవి. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడంలో ముందుండి, కష్టపడి పనిచేసే వ్యక్తిగా ఆయన విస్తృతంగా గౌరవించబడ్డారు. పరిపాలనా విషయాలపై ఆయనకున్న అవగాహన, పేదలను, అణగారిన వర్గాలను సాధికారత కల్పించాలనే ఆయన తపన కూడా ప్రశంసనీయమైనవి. అజిత్ పవార్ కుటుంబానికి, అభిమానులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలుపారు
రాష్ట్రపతి, ద్రౌపది ముర్ము
మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా అనేక మంది మరణించారనే వార్త తీవ్ర బాధాకరం. అజిత్ పవార్ అకాల మరణం కోలుకోలేని నష్టం. మహారాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా సహకార రంగంలో ఆయన చేసిన కృషికి ఆయన ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రమాదంలో మరణించిన వారందరి కుటుంబాలకు ఈ నష్టాన్ని భరించే శక్తిని కూడా దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానని రాష్ట్రపతి, ద్రౌపది ముర్ము తెలియజేశారు.
Also Read: మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి