West Bengal School: పశ్చిమ బెంగాల్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్కూల్లో స్థానిక పోలీసులు తనిఖీలు జరపగా రూ. కోటికి పైగా నగదు, కండోమ్ ప్యాకెట్లు, లిక్కర్ బాటిళ్లు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా ఖంగు తిన్న అధికారులు.. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై పాఠశాల అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లా కంచరపడలో ఉన్న ‘హార్నెట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్’లో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు చెందిన తాత్కాలిక ప్రిన్సిపల్ బికాష్ చంద్రపాల్.. స్కూల్ యాజమాన్యం, అకౌంటెట్లు సహా నలుగురిపై బుధవారం (జూన్ 10న) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. గురువారం అకస్మికంగా పాఠశాలలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ గదిలో రూ.1.77 కోట్ల డబ్బుతో పాటు మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లను అధికారులు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
రైడ్ లో భాగంగా తొలుత స్కూల్లో అడుగుపెట్టిన పోలీసులకు అక్కడి పరిస్థితులు అనుమానస్పదంగా అనిపించాయి. ముఖ్యంగా మూసి ఉన్న ఓ గదిపై వారి దృష్టి మళ్లినట్లు సమాచారం. దీంతో అకౌంటెంట్ అభిక్ కుమార్ నాగ్ ను గది తలుపులు తెరవమని ఆదేశించగా.. అతడు తొలుత నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. పోలీసులు ఒత్తిడి చేయడంతో అతడు బలవంతంగా తలుపు తెరిచినట్లు సమాచారం. ఆ గదిలో ఈ డబ్బు, నగదు, కండోమ్ ప్యాకెట్లతో పాటు బెడ్ రూమ్ ను తలపించేలా ఓ బెడ్ కూడా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. కాగా, నగదుతో పాటు స్కూల్ కు సంబంధించి పత్రాలు, కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని అధికారులు సీజ్ చేశారు. దర్యాప్తులో భాగంగా స్కూల్ అకౌంటెంట్ తో పాటు అతడి అసిస్టెంట్ ను అదుపులోకి తీసుకెళ్లారు.
అయితే స్కూల్లో ఈ స్థాయిలో డబ్బు బయట పడుతుందని పోలీసులు సైతం ఊహించలేదు. పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడటంతో వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. డబ్బును లెక్కించేందుకు అప్పటికప్పుడు నోట్ల లెక్కింపు మిషన్ ను అధికారులు తీసుకొచ్చారు. దాదాపు గంటకు పైగా సమయం తీసుకొని కౌంటింగ్ చేయగా.. రూ.1.77 కోట్లు ఉన్నట్లు లెక్క తేలింది. అయితే ఈ మెుత్తం పాఠశాలకు చెందిందా? లెక్కల్లో చూపని వసూళ్లకు సంబంధించిందా? లేదా ఎక్కడినుంచైనా తీసుకొచ్చి ఇక్కడ దాచారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: చాంతాడంత బ్యాటరీ.. మూడు రోజుల బ్యాకప్.. మార్కెట్లోని టాప్-4 బాహుబలి ఫోన్లు!
మరోవైపు ఈ ఘటనపై పాఠశాల తాత్కాలిక ప్రిన్సిపల్ బికాష్ చంద్రపాల్ స్పందించారు. నగదును బ్యాంకులో డిపాజిట్ చేయకుండా ఈ స్థాయిలో స్కూల్లో దాచారన్న విషయం తనకు తెలియదని పేర్కొన్నారు. తాను కేవలం విద్యా సంబంధిత వ్యవహారాలను మాత్రమే చూసుకుంటున్నట్లు చెప్పారు. ఆర్థిక లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరోవైపు స్కూల్లో దొరికిన కండోమ్ ప్యాకెట్ల గురించి స్పందిస్తూ.. తాను కూడా అవి చూసి షాకైనట్లు చెప్పారు. అవి ఎలాగా స్కూల్లోకి వచ్చాయో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సుదీప్త దాస్ పాఠశాలను సందర్శించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు.
Also Read: YouTube వాడుతున్నారా? ఇలా చేస్తే డేటా అయిపోదు.. రోజంతా హ్యాపీగా చూడొచ్చు!