Hyderabad-Mumbai Bullet Train Route Finalised: హైదరాబాద్ నుంచి ముంబైకి కేవలం మూడు గంటల్లో చేరుకునేలా రూపొందిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్-పూణే-ముంబై బుల్లెట్ రైలు కారిడార్ కు సంబంధించిన డీపీఆర్ రెడీ అయ్యింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుతం 12 నుంచి 15 గంటలు పట్టే ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ముంబైకి రైలులో వెళ్లాలంటే దాదాపు 15 గంటలు, కారులో వెళ్లాలంటే 12 గంటల వరకు సమయం పడుతోంది. కానీ, బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఈ దూరాన్ని మూడు గంటల్లోపు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. హైస్పీడ్ రైలు సర్వీసు హైదరాబాద్ నుంచి ముంబైకి సుమారు 2 గంటల 55 నిమిషాల్లో చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. కొన్ని అదనపు స్టాప్లు ఉన్న సర్వీసులకు మూడు గంటల కంటే కొద్దిగా ఎక్కువ సమయం పట్టవచ్చని అధికారులు చెప్తున్నారు.
ఈ బుల్లెట్ రైలు మార్గం మొత్తం 671 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో తెలంగాణలో 93 కిలోమీటర్లు, కర్ణాటకలో 121 కిలోమీటర్లు, మహారాష్ట్రలో 457 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మించనున్నారు. ఈ కారిడార్ హైదరాబాద్ ను పూణే మీదుగా ముంబైతో లింక్ చేస్తుంది.
తెలంగాణలో కోకాపేట్, వికారాబాద్, శంషాబాద్ ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. శంషాబాద్ సమీపంలోనే రైళ్ల మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక డిపో కూడా నిర్మించే అవకాశం ఉంది. కర్ణాటకలో కలబురగి కీలక స్టేషన్ గా ఉండనుంది. మహారాష్ట్రలో విక్రోలి, థానే, నవీ ముంబై, లోనావాలా, పింప్రి-చించ్వాడ్, పూణే, బారామతి, పండర్ పూర్, సోలాపూర్ లాంటి ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఈ నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణ సౌకర్యం లభించనుంది.
ఈ కారిడార్లో నడిచే బుల్లెట్ రైళ్లు గంటకు సుమారు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో నడిచే సాధారణ ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ వేగం. అందుకే ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్రలోని కొండ ప్రాంతాల్లో పలు సొరంగాలను నిర్మించనున్నారు. ముఖ్యంగా ఖండాలా ఘాట్ ప్రాంతంలో 24 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం ప్రతిపాదించారు. అదనంగా కొన్ని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ మార్గాలను కూడా నిర్మించనున్నారు.
బుల్లెట్ రైలు స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రయాణికుల కోసం పార్కింగ్, ఆధునిక సౌకర్యాలు, ఇతర రవాణా వ్యవస్థలతో అనుసంధానం లాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రతి రైలులో 16 కోచ్లు ఉండగా, సుమారు 1,200 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణించగలరు.
ఈ ప్రాజెక్టు 2026-27 కేంద్ర బడ్జెట్ లో ప్రకటించారు. డీపీఆర్ సిద్ధం కావడంతో ఇప్పుడు భూసేకరణ, అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయడంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. అన్ని పనులు అనుకున్న విధంగా పూర్తయితే, హైదరాబాద్-ముంబై మధ్య ప్రయాణం సమయం మరింత తగ్గనుంది.
Read Also: కాశ్మీర్-లడఖ్ కు 365 రోజుల కనెక్టివిటీ.. జోజిలా టన్నెల్ తవ్వకం పూర్తి!