Supreme Court: మహిళల నెలసరి సెలవుపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. యజమానుల మనస్తత్వం తెలియదని, తాము అలాంటి చట్టం చేస్తే కంపెనీలు వారిని ఉద్యోగాల్లో నియమించుకోరని వ్యాఖ్యానించింది. తాము పురుషుల కంటే తక్కువ అనే భయం ఉద్యోగాలు చేసే మహిళల్లో కలిగే అవకాశముందన్నారు.
నెలసరి సెలవు ఇష్యూ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దేశంలో నెలసరి సెలవు తప్పనిసరి చేస్తే.. మహిళల ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. మనం అలాంటి చట్టాలు చేస్తే కంపెనీలు మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవని అభిప్రాయపడింది. ఆ సెలవుకు సంబంధించిన నియమాలు రూపొందించేలా రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అలాంటి చట్టం తాము పురుషుల కంటే తక్కువ అనే భయం మహిళల్లో ఉంటుందన్నారు. రుతుక్రమం అంశంపై అవగాహన కల్పించడం వేరని తెలిపింది. దానిని సెన్సేషన్ చేయడం వేరని పేర్కొంది. ఈ తరహా చట్టాన్ని తీసుకువచ్చిన మరుక్షణం వారిని ఎవరూ ఉద్యోగాల్లో నియమించుకోరని తేల్చి చెప్పింది.
అలాగైతే మహిళల కెరీర్ క్లోజ్
యాజమాన్యాల మనస్తత్వం మీకు తెలియదంటూ పిటిషనర్ను ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు. వెంటనే జోక్యం చేసుకున్న సీనియర్ న్యాయవాది ఎంఆర్ షంషద్ తన వాదనలు వినిపించారు. 2013లో ప్రభుత్వం ఆధ్వర్యంలో యూనివర్సిటీల్లో విద్యార్థినులకు నెలసరి సెలవును మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రైవేటు కంపెనీలు అలాంటి వెలుసుబాటు కల్పించాయని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి, అవన్నీ స్వచ్ఛందంగా తీసుకున్న చర్య అని అన్నారు. ఆ సెలవు తప్పనిసరి చేస్తే మహిళల కెరీర్ ముగుస్తుందని మరోసారి చెప్పారు. మహిళల కెరీర్ను దృష్టిలో పెట్టుకొని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది.
ALSO READ: కొత్త అద్దె చట్టం.. అద్దెదారులకు భారీ ఊరట.. ఇకపై అగ్రిమెంట్ తప్పనిసరి
జపాన్, దక్షిణ కొరియా, స్పెయిన్ వంటి దేశాలు నెలసరి సెలవు విధానాన్ని అమలు చేశాయి. దీనివల్ల మహిళలు ఋతుస్రావం సమయంలో సెలవు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి యూరోపియన్ దేశం స్పెయిన్. ఆ తర్వాత ఇండోనేషియా, తైవాన్ వంటి దేశాలు ఇలాంటివి అమలు చేస్తున్న విషయం తెల్సిందే.