Supreme Court Grants Bail to Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ జారీ చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓ పార్టీ అధినేతగా ప్రచారం చేయాల్సిన అవసరాన్ని ధర్మాసనం గుర్తించి.. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. అయితే మే 7వ తేదీన కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ తీర్పును రిజర్వ్ చేసింది. ఆ విచారణ సమయంలో కేజ్రీవాల్ కు ఒకవేళ బెయిల్ ముంజూరు చేస్తే.. తాను ముఖ్యమంత్రిగా ఎటువంటి అధికారిక పనులు చేపట్టరాదని వెల్లడించింది. దీంతో పాటుగా లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎటువంటి ఫైల్స్ తిరగేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
లిక్కర్ పాలసీ కేసులో భారీగా మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ అధికారులు మార్చి 21న ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో భాగంగా దర్యాప్తు సంస్థలు తొమ్మిది సార్లు కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేశాయి. వాటికి ఆయన స్పందించకపోవడంతో ఆయన్ను ఈడీ అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించింది. జైలులో ఉన్న కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా.. దానిపైవిచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: కవితకు మళ్లీ నిరాశే.. బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
కేజ్రీవాల్ బెయిల్ పై బయట ఉంటే 21 రోజులు ఆయన ఏం చేయాలో, ఏం చేయకూడదో కోర్టు కొన్ని షరతులను విధించింది. బెయిల్ పై బయట ఉన్న సమయంలో కేజ్రీవాల్ సీఎం కార్యాలయానికి వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఢిల్లీ సెక్రెటేరియట్ కు వెళ్లకూడదని ఆంక్షలు విధించింది.
లిక్కర్ పాలసీ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులను కేజ్రీవాల్ కలవకూడదని.. వారితో మాట్లాడకూడదని పేర్కొంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి లేకుండా ఎటువంటి ఫైల్స్ పై సంతకం చేయకూడదని వెల్లడించింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఈ ప్రచారంలో లిక్కర్ పాలసీ గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టం చేసింది.