Kavitha Bail Petition Plea Postponed in Delhi High Court: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్నిసార్లు ప్రయత్నించినా బెయిల్ మంజూరు కావడంలేదు. ఇప్పటికే పలుమార్లు బెయిల్ రిజెక్ట్ అవ్వగా.. ఈసారి బెయిల్ కోసం ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారామె. ఈ మేరకు 1149 పేజీలతో బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు.
మే 6వ తేదీన ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్లను రౌస్ కోర్టు డిస్మిస్ చేసింది. దానిని సవాల్ చేస్తూ.. ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది కవిత. కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలకు సమయం కావాలని కోరింది ఈడీ. ఈడీ సమయం కోరడంతో .. తదుపరి విచారణను మే 24కు వాయిదా వేసింది. మరోసారి కవితకు నిరాశ తప్పలేదు. మే 24న ఈడీ వాదనల విన్న అనంతరం ఢిల్లీ హై కోర్టు తీర్పునిచ్చే అవకాశాలున్నాయి.
Also Read: Amritpal Singh To File Nomination: ఎన్నికల బరిలో ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్,
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసి.. కోర్టు అనుమతితో విచారించింది. ఆ తర్వాత ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఆప్ పార్టీతో జరిగిన లావాదేవీలు, లిక్కర్ పాలసీలో అవకతవకలపై ప్రశ్నించగా.. కవిత ఏవీ చెప్పలేదని ఈడీ అధికారులు తెలిపారు. కవిత అరెస్టై రెండు నెలలు కావస్తోంది. ఇప్పటికైనా ఆమె బెయిల్ పై బయటికి వస్తుందని ఆశగా ఎదురుచూసిన బీఆర్ఎస్ శ్రేణులకు నిరాశ తప్పలేదు. కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేది 24న తేలనుంది.