Supreme Court Verdict: 15 ఏళ్ల బాలిక గర్భం దాల్చిన ఘటనలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. శుక్రవారం వెలువరించిన ఈ తీర్పులో, 31 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి 15 ఏళ్ల బాలికకు అనుమతి ఇచ్చింది. గర్భాన్ని పూర్తికాలం మోయమని బాలికను బలవంతం చేయడం ఆమె ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది. మహిళల పునరుత్పత్తి స్వేచ్ఛకు “అత్యున్నత ప్రాధాన్యత” ఇవ్వాలని జస్టిస్ బి.వి. నాగరాత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం తెలిపింది.
బాలిక మానసిక పరిస్థితి, ఆమె రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిన విషయాన్ని గమనించిన కోర్టు.. గర్భం కొనసాగించమని బలవంతం చేయలేమని పేర్కొంది. గౌరవంగా జీవించే బాలిక హక్కుకు భంగం కలిగించలేమని పేర్కొంది. ఆర్టికల్ 21 ప్రకారం, ఒకరి శరీరానికి సంబంధించిన విషయంపై, ముఖ్యంగా పునరుత్పత్తి విషయాలలో నిర్ణయాలు తీసుకునే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతలో అంతర్భాగమని ధర్మాసనం తెలిపింది.
మైనర్లు, అవాంఛిత గర్భానికి సంబంధించిన కేసుల్లో.. వారిని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా తీర్పును ఇవ్వలేమని జస్టిస్ నాగరాత్న అన్నారు. ఏ న్యాయస్థానం కూడా మహిళను, మరీ ముఖ్యంగా మైనర్ను, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా గర్భం మోయమని బలవంతం చేయకూడదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గర్భం మోయమని వారిని బలవంతం చేస్తే తీవ్రమైన మానసిక, శారీరక క్షోభ కలుగుతుందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, గర్భం తొలగిస్తే మైనర్ కు ఎదురయ్యే ప్రమాదాన్ని ప్రస్తావించారు. వైద్య పరంగా అబార్షన్లకు చట్టబద్ధంగా 24 వారాల గడువు మాత్రమే ఉందని గుర్తుచేశారు. చివరి దశలో అబార్షన్లు అధిక ప్రమాదాలకు దారి తీస్తాయని చెప్పారు. 15 ఏళ్ల బాలికను శారీరకంగా, మానసికంగా సన్నద్ధం చేసి బిడ్డను కనేలా చేయాలని వాదనలు వినిపించారు. ఆ తర్వాత బిడ్డను దత్తతకు ఇవ్వాలని తుషార్ మెహతా సూచించారు.
Also Read: మతం మారినట్లు ఎలా నిరూపిస్తారు? కోర్టులు పరిగణనలోకి తీసుకునే సాక్ష్యాలివే!
అబార్షన్ కోసం ఎవరైనా వస్తే ప్రతిసారీ, ఆర్థిక సహాయం కోరమని చెప్పలేమని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. భయం వల్ల గానీ లేదా అవగాహన లేకపోవడం వల్ల, గర్భం 24 వారాలు దాటే వరకు అమ్మాయిలు బయటపెట్టడంలేదని ఆమె అన్నారు. కోర్టు ఇలాగే తిరస్కరిస్తూ ఉంటే, బాధితులు కోర్టుకు రావడం మానేస్తారని ఆమె అన్నారు. అవాంఛిత గర్భం ఇప్పటికే బాలిక జీవితాన్ని ఇప్పటికే తీవ్రంగా ప్రభావితం చేసిందని, దీంతో నెలల తరబడి ఆమె చదువుకు అంతరాయం కలిగిందని పిటిషనర్ వాదించారు. ఇటువంటి అసాధారణ పరిస్థితులలో, గర్భాన్ని వైద్యపరంగా తొలగించడానికి ఉన్న విధానాలు, చట్టపరమైన పరిమితుల కంటే బాలిక శ్రేయస్సే ముఖ్యమని కోర్టు పేర్కొంది.