Supreme Court: మత మార్పిడిలు, రిజర్వేషన్ల అంశం.. భారత్లో ఓ సున్నితమైన, వివాదాస్పదమైన చర్చనీయాంశం. ఇప్పుడు.. క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు సంబంధించి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. హిందూ మతాన్ని వీడి క్రైస్తవంలోకి మారితే, ఆ వ్యక్తికి ఉన్న ఎస్సీ హోదా రద్దవుతుందనే అంశంపై స్పష్టత రావడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. మతమార్పిడి తర్వాత అట్రాసిటీ చట్టం కింద కేసులపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరని స్పష్టం చేసింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే.. ఆ హక్కులు పొందుతారని తెలిపింది.
బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్ చింతాడ ఆనంద్ ఎలాంటి అనుమతులు లేకుండా చర్చి నిర్వహించడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. వారిపై అట్రాసిటీ నిరోధక చట్టం కింద ఆనంద్ కేసు పెట్టారు. ఈ కేసుని కొట్టివేయాలంటూ స్థానికులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. చింతాడ ఆనంద్ పాస్టర్గా పనిచేస్తుండటంతో.. క్రిస్టియన్ అవుతారని, రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ కులాలకు సంబంధం ఉండదని వాదించారు. పుట్టుకతో హిందువైనా, క్రైస్తవం స్వీకరించడంతో ఆనంద్ షెడ్యూల్ కులానికి చెందరని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్లు ఆయనకు వర్తించవని, ఆనంద్ తమపై చేసిన ఫిర్యాదు చట్ట వ్యతిరేకమని, తమపై పెట్టిన కేసుకు విచారణార్హత లేదని వాదించారు. ఈ వాదనలని ఏపీ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ లేదని తెలిపింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతస్థులే ఎస్సీలు అవుతారని స్పష్టం చేసింది.
ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పాస్టర్ చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అంజరియా ధర్మాసనం.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలను అనుసరించే వారు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలా కాకుండా, మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని తేల్చి చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్గా పని చేస్తున్న వ్యక్తి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని స్పష్టం చేసింది. మతం మారితే కుల సర్టిఫికెట్ రద్దు కాకపోయినా చట్టం వర్తించదని ధర్మాసనం తెలిపింది. సర్టిఫికెట్ ఉంది కాబట్టి రక్షణ కల్పించాలని చెప్పలేమంది. చింతాడ ఆనంద్ కొన్నేళ్లుగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ, ప్రార్థనలు నిర్వహిస్తున్నారని ఆధారాలతో సహా నిరూపితమైంది. దాంతో.. ఆయనకు ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ కులాల నిబంధనల ప్రకారం.. హిందూ, సిక్కు, బౌద్ధ మతం కాకుండా, ఇతర మతాలకు మారిన వ్యక్తులను షెడ్యూల్డ్ కులాల సభ్యులుగా పరిగణించరు. ఎందుకంటే, క్రైస్తవం, ఇస్లాం మతాల్లో కుల వివక్ష లేదని భావిస్తారు కాబట్టి, వారు ఎస్సీ హోదాను కోల్పోతారని సుప్రీం ధర్మాసనం వివరించింది. కేవలం ఎస్సీ సర్టిఫికెట్ కలిగి ఉన్నంత మాత్రాన, ఆచరణలో వేరే మతాన్ని అనుసరిస్తుంటే, ఆ హోదా చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారినట్లు నిర్ధారణ అయితే, అతనిపై జరిగే కుల వివక్షాపూరితమైన దాడులు, అవమానాల విషయంలో.. అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయడం సాధ్యపడదని కోర్టు స్పష్టం చేసింది. మతం మారిన వ్యక్తి.. తిరిగి స్వమతంలోకి మారినట్లు ఆధారాలు ఉంటే తప్ప, ఎస్సీ హోదా పునరుద్ధరించకూడదని తెలిపింది. న్యాయపరంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు కీలకంగా మారింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా మత మార్పిడి చేసుకున్న దళితుల రిజర్వేషన్లు, ఇతర చట్టపరమైన రక్షణపై చర్చకు దారితీసింది. ఒక మతం నుంచి మరొక మతానికి మారి, కొత్త మతంలో ఉన్న సౌకర్యాలు పొందుతూ, పాత మతంలో ఉన్న రిజర్వేషన్లను వాడుకోవడం సమంజసం కాదనే వాదన వినిపిస్తోంది. మతం అనేది వ్యక్తిగత విశ్వాసం. కానీ, రిజర్వేషన్ సామాజిక హోదాకు గుర్తింపు. ఈ రెండింటి మధ్య ఉన్న సన్నని గీతను సుప్రీంకోర్టు తన తీర్పుతో స్పష్టం చేసింది. మతం మారిన వ్యక్తి, తన సామాజిక ప్రయోజనాల కోసం రక్షణ చట్టాలని వాడుకోవడం.. రాజ్యాంగబద్ధంగా కరెక్ట్ కాదనేది సుప్రీంకోర్టు అభిప్రాయం.
మతం.. కులం.. రిజర్వేషన్లు.. భారతదేశంలో ఇవి కేవలం సామాజిక అంశాలు మాత్రమే కాదు. అత్యంత సున్నితమైన రాజకీయ అంశాలు కూడా. క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు, ఎస్సీ హోదా రద్దవుతుందని సుప్రీంకోర్టులు వెలువరించిన తీర్పు.. దేశవ్యాప్తంగా కొత్త డిబేట్కు దారితీసింది. అయితే, రాజ్యాంగ నిబంధనల ప్రకారం, హిందూ, సిక్కు, బౌద్ధ మతాల్లోని కొన్ని వర్గాలకు మాత్రమే ఎస్సీ హోదా వర్తిస్తుంది. ఈ క్రమంలో.. మతమార్పిడి చుట్టూ ఉన్న చిక్కుముడులేంటి? ఒక వ్యక్తి మతం మారారని ఎలా గుర్తిస్తారు? దీనివల్ల వచ్చే రాజకీయ పరిణామాలు ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్.
ఓ వ్యక్తి మతం మారారని చెప్పడానికి.. చట్టపరంగా, సామాజికంగా కొన్ని ప్రామాణికాలు ఉన్నాయ్. కేవలం, ఓ ప్రార్థనా మందిరానికి వెళ్లినంత మతం మారినట్లు కోర్టులు పరిగణించవు. దీనికి సంబంధించి కొన్ని అంశాలను చూస్తారు. ఓ వ్యక్తి స్వచ్ఛందంగా తన మతాన్ని మార్చుకుంటున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం గానీ, మత పెద్ద ద్వారా కన్వర్షన్ సర్టిఫికెట్ పొందడం జరిగితే అధికారికంగా మతం మారినట్లు అవుతుంది. అంతేకాదు.. ఆ వ్యక్తి తన పాత మత ఆచారాలను వదిలేసి, కొత్త మత సంప్రదాయాలను పాటిస్తున్నారా? లేదా? అనేది కూడా కీలకం అవుతుంది. ఇక, ఆ వ్యక్తిని సమాజం, ఆ మత వర్గం తమలో ఒకరిగా గుర్తించిందా? అనేది కూడా సాక్ష్యంగా మారుతుంది. కోర్టుల్లో ఓ వ్యక్తి మత మార్పిడిని నిరూపించేందుకు.. విద్యార్థి దశలో అడ్మిషన్ రిజిస్టర్లో నమోదు చేసిన మతం వివరాలు, క్రైస్తవ మతమైతే చర్చి రికార్డుల్లో ఉన్న వివరాలు, ప్రభుత్వం నుంచి పొందిన పత్రాల్లో మతం కాలమ్లో ఏముంది? అనేది కీలకంగా మారుతుంది.
ఇలాంటి తీర్పులు రాజకీయంగా పెను దుమారాన్నే రేపుతాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ముఖ్యంగా.. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో భాగంగా.. మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగించాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేసే అవకాశాలుంటాయ్. ఎస్సీ హోదా రద్దు చేయాలని భావిస్తే.. దళిత వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది. ఇక.. మత మార్పిడిలని అడ్డుకోవాలని చూస్తున్న ఇంకొన్ని పార్టీలకు.. ఇదొక ఆయుధంగా మారుతుంది. మతం మారితే.. అట్రాసిటీ చట్టాల ద్వారా లభించే రక్షణ కోల్పోతారనే హెచ్చరిక.. మత మార్పిడిలని తగ్గిస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయ్.
ఇప్పటికే రిజర్వేషన్ల ఫలాలు పొందుతున్న వారు, కొత్తగా ఎస్సీ హోదా కోరే క్రైస్తవ దళితుల వల్ల తమకు పోటీ పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇది, ఎస్సీల మధ్యే అంతర్గత విభేదాలకు కూడా దారితీసే అవకాశముంది. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు, పోటీ పడుతున్న వారు మతం మారినట్లు తేలితే, వారి సర్టిఫికెట్లు రద్దయ్యే అవకాశం ఉంది. దాంతో.. కుల ధ్రువీకరణ పత్రాల జారీలో కఠిన నిబంధనలు వచ్చే అవకాశాలున్నాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. ఎస్సీ హోదాని కేవలం కొన్ని మతాలకే పరిమితం చేయడం రాజ్యాంగ విరుద్ధమని కొందరు, అది సరైందేనని ఇంకొందరు న్యాయపోరాటాలకు దిగే ఛాన్స్ కూడా ఉంది.
మతం మారితే ఎస్సీ హోదా పోతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో.. మత మార్గిడులు తగ్గే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. కేవలం ఆర్థిక, సామాజిక భద్రత కోసం మతం మారే వారు, రిజర్వేషన్లు, చట్టపరమైన రక్షణ కోల్పోతామనే భయంతో వెనకడుగు కూడా వేసే అవకాశముంది. ఇప్పటికే మతం వారిన వారు తమ ఎస్సీ హోదాను కాపాడుకునేందుకు తిరిగి హిందూ మతంలోకి వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయ్.
మతం వ్యక్తిగత విశ్వాసం కాగా, రిజర్వేషన్ సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా వచ్చే హక్కు. మతం మారినా సామాజిక వివక్ష పోలేదని కొందరు వాదిస్తుంటే, రాజ్యాంగం కల్పించిన హోదాను ఇతర మతాల్లోకి తీసుకెళ్లొద్దని ఇంకొందరు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో.. ఇప్పటికే ఈ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ రిపోర్ట్ ఇప్పుడు కీలకం కానుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చట్ట సవరణ చేస్తుందా? లేదా? అనేది దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసే అవకాశం ఉంది.
Also Read: రియల్ ఎస్టేట్ షేక్.. బిల్డర్లకు సర్కార్ ఇచ్చిన ‘జాక్పాట్’ ఆఫర్ ఇదే!
Story by: Anup, Big Tv