Supreme Court minor abortion case: అత్యాచార బాధితురాలైన 15 ఏళ్ల మైనర్ బాలిక గర్భవిచ్ఛిత్తి వ్యవహారంలో గురువారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధిత బాలిక 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు గతంలోనే అనుమతినిచ్చిన అత్యున్నత న్యాయస్థానం.. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా అత్యాచార బాధితులకు సంబంధించి ప్రస్తుతమున్న గర్భవిచ్ఛిత్తి చట్టాలను మరింత మానవీయ కోణంలో సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
అత్యాచార బాధితురాలైన బాలిక మానసిక క్షోభను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, ఆమె ఆరోగ్యంపై శాశ్వత ప్రభావం లేకపోతే గర్భవిచ్ఛిత్తి నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో తుది నిర్ణయాన్ని బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రులకే వదిలేస్తున్నట్లు పేర్కొంది. వారికి సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడాలని, అవసరమైతే కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించింది. అత్యాచార బాధితుల కోసం చట్టాల్లో మార్పులు చేయాలని కేంద్రానికి దిశానిర్దేశం చేస్తూ.. 20 వారాలు దాటిన తర్వాత కూడా అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేలా నిబంధనలను సవరించాలని న్యాయస్థానం కోరింది.
ఈ కేసులో గర్భవిచ్ఛిత్తికి అనుమతినిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎయిమ్స్ (AIIMS) వైద్య బృందం క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. గర్భం దాల్చి ఇప్పటికే 30 వారాలు దాటినందున.. ఈ దశలో గర్భవిచ్ఛిత్తి చేయడం వల్ల ఆ బాలిక శారీరక.. మానసిక ఆరోగ్యంపై సుదీర్ఘకాలం పాటు తీవ్ర ప్రభావం పడుతుందని ఎయిమ్స్ కోర్టుకు నివేదించింది. మరో నాలుగు వారాల్లో డెలివరీ అయ్యే అవకాశం ఉన్నందున.. బిడ్డకు జన్మనిచ్చి అనంతరం ఆ శిశువును దత్తతకు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని వైద్యులు సూచించారు.
ఎయిమ్స్ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కోర్టులో వాదనలు వినిపిస్తూ.. “ఎంతో ఆవేదనతో ఈ పిటిషన్ను దాఖలు చేస్తున్నామని.. ఇదంతా ఆ మైనర్ బాలిక క్షేమం కోసమేనని” వెల్లడించారు. ఇష్టం లేకుండా ఒక మహిళ లేదా ఒక బాలిక గర్భాన్ని కొనసాగించాలని బలవంతం చేయలేమని గతంలోనే స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. ఇప్పుడు వైద్యుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని మధ్యేమార్గాన్ని అన్వేషిస్తోంది. వైద్యపరమైన చిక్కులు.. బాధితురాలి హక్కుల మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరాన్ని న్యాయస్థానం నొక్కి చెప్పింది.
ఈ ఉదంతం దేశంలో గర్భవిచ్ఛిత్తి చట్టాల (MTP Act) పరిమితులపై మరోసారి చర్చకు దారితీసింది. అత్యాచార బాధితులు గర్భం దాల్చినప్పుడు గడువు దాటిన తర్వాత కూడా వారికి సురక్షితమైన వైద్య సేవలు అందేలా చట్టాల్లో మార్పులు తేవాలని సుప్రీంకోర్టు కేంద్రానికి దిశానిర్దేశం చేసింది. బాధితురాలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కేసులో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Read Also: Amaravati: ప్రజల కంటే అమరావతికే ప్రయార్టీ.. కష్టాలు పట్టించుకోకుంటే గుణపాఠం తప్పదని షర్మిల హెచ్చరిక