Amaravati: ఏపీలో కూటమి సర్కార్పై మరోసారి మండిపడ్డారు కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఇంధన కొరతతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తోందని ఆరోపించారు. ప్రజల కష్టాల కన్నా అమరావతి పనులకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు సర్కార్ను గుణపాఠం తప్పదన్న వైఎస్ షర్మిల
ఏపీ చంద్రబాబు సర్కార్పై ధ్వజమెత్తారు కాంగ్రెస్ చీఫ్ షర్మిల. నాలుగైదు రోజులుగా ఇంధన కొరత ప్రజలను వెంటాడుతోంది. ఫలితంగా వాహనదారులు, రైతులు పెట్రోల్, డీజిల్ కోసం గంటల తరబడి క్యూలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా అవసరాలపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం, కేవలం అమరావతి కాంట్రాక్టర్ల గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.
కాంట్రాక్టర్ల కోసం ప్రత్యేకంగా డీజిల్ సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరడం వెనుక ప్రభుత్వ వైఖరి అర్థమవుతోందన్నారు. రైతు కన్నా కాంట్రాక్టర్ ముఖ్యమా? అంటూ ప్రశ్నలు సంధించారు. ఎక్స్ వేదికగా ఆమె పలు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజల కష్టాల కన్నా అమరావతి పనులను ప్రాధాన్యం ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల కంటే అమరావతి పనులకే ప్రాధాన్యత, గుణపాఠం తప్పదని హెచ్చరిక
ఇది పాలన కాదని, ప్రాధాన్యతల వైఫల్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు, సాధారణ ప్రజలకు నిరంతర ఇంధనం అందేలా చూడాలన్నారు. ఆ తర్వాత కాంట్రాక్టర్ల గురించి మాట్లాడాలన్నారు. ప్రజలు ఎలా పోతే ఏంటి మాకేంటి అనుకుంటే, ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన డీజిల్ను రిటైల్ ధరలకు సరఫరా చేయాలన్న ఏపీ ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించిన విషయం తెల్సిందే. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఏపీ పౌర సరఫరాల కమిషనర్ ఆదేశాలు పెట్రోలియం రూల్స్, ఇతర నిబంధనలకు అనుగుణంగా లేవని కేంద్ర పెట్రోలియం కార్యదర్శి నీరజ్ మిట్టల్ పేర్కొన్నారు.
ALSO READ: ఏపీ పదో తరగతి ఫలితాల్లో సంచలనం.. 600కు 599 మార్కులు సాధించిన విశాఖ విద్యార్థి!