Hindu Succession Act: ఆస్తి పంపకాల్లో వివాదాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరణానంతరం ఆస్తిని ఎవరికి పంచాలనే విషయంలో హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. మహిళల మరణానంతరం ఆస్తుల విషయంలో, మహిళ తల్లిదండ్రులకు, అత్తింటి వారికి మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
హిందూ వివాహిత మహిళలు తమ ఆస్తిని పుట్టింటి వారికి లేదా అత్తింటి వారికి ఎవరికి చెందాలో ముందుగానే వీలునామా రాసుకోవాలని సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం, పిల్లలు లేని వితంతువు ఆస్తులు ఆమె మరణం తర్వాత భర్త కుటుంబానికి చెందుతాయని పేర్కొంది. వారసత్వ చట్టంలోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ ఒక మహిళా న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్ లతో కూడిన ధర్మాసనం విచారించింది.
“పిటిషనర్కు ఏ ఆస్తిపైనా వ్యక్తిగత దావా లేదు. హిందూ వారసత్వ చట్టంపై ఆమె పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ సూచన మేరకు ఈ సమస్యను తాము పరిష్కరించాలనుకోవడం లేదు. ఈ పిల్ పై ఎటువంటి ఆదేశాలు జారీ చేయడానికి నిరాకరిస్తున్నాము” అని సుప్రీంకోర్టు తెలిపింది.
మరణించిన మహిళ తల్లిదండ్రులు ఆమె ఆస్తిపై దావా వేస్తే కోర్టుకు వెళ్లే ముందు ఈ విషయంపై మధ్యవర్తులతో చర్చించడం మంచిదని ధర్మాసనం అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాజ్యాలను నివారించడానికి ముఖ్యంగా హిందూ మహిళలు, వారి వయస్సుతో సంబంధం లేకుండా, ఆస్తి తమతదనంతరం ఎవరికి చెందాలో వీలునామా రాసుకోవాలని సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసింది.
కేంద్రం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్ ఈ పిటిషన్ను వ్యతిరేకించారు. ఈ ప్రశ్నలను బాధితులు లేవనెత్తాలని సూచించారు.
హిందూ వారసత్వ చట్టం ప్రకారం హిందూ మహిళ ఆస్తిపై మొదటి హక్కు ఆమె భర్త, ఆమె కుమారులు లేదా కుమార్తెలదే అన్నారు. తరువాత భర్త వారసులు, తరువాత ఆమె తల్లిదండ్రులు ఉంటారని కోర్టుకు తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో దిగువన ఆమె తండ్రి, తల్లి, వారి వారసులు ఉంటారన్నారు. ఈ నిబంధనల కారణంగా మహిళ అత్తింటికి, పుట్టింటి మధ్య వివాదాలకు దారితీస్తాయన్నారు.
Also Read: Bank Queue: బ్యాంకు ముందు నోట్ల రద్దు తరహా భారీ లైన్లు.. కారణం ఇదే
హిందూ వారసత్వ చట్టంలోని నిబంధనలకు సవాళ్లను పరిశీలించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తామని సుప్రీంకోర్టు గతంలో తెలిపింది. మహిళల హక్కులు ముఖ్యమైనవి అయినప్పటికీ, సామాజిక నిర్మాణం, మహిళలకు హక్కులు ఇవ్వడం మధ్య సమతుల్యత ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది.