Tamil Nadu Assembly: ఎట్టకేలకు బలపరీక్షలో విజయ్ ప్రభుత్వం గట్టెక్కింది. విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. తటస్థం ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండిపోయారు. డీఎంకే, అన్నాడీఎంకెలోని పళనిస్వామి వర్గం ఓటింగ్ నుండి వాకౌట్ చేశాయి. బలనిరూపణకు అవసరమైన దానికంటే ఎక్కువ మంది సభ్యులు విజయ్ ప్రభుత్వం వైపు నిలిచారు.
బల పరీక్షలో నెగ్గిన టీవీకే ప్రభుత్వం.. విపక్షాలు వాకౌట్
బల పరీక్ష సందర్భంగా సీఎం విజయ్ మాట్లాడారు. తమిళనాడు కోసం పని చేస్తానని కుండబద్దలు కొట్టేశారు. మాది సెక్యులర్ ప్రభుత్వమని, ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామన్నారు. అలాగే గత ప్రభుత్వ పథకాలు కొనసాగిస్తామన్నారు. మా ప్రభుత్వం ఐదేళ్లు సంపూర్ణంగా అధికారంలో ఉంటుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.
మేము హార్స్ ట్రేడింగ్ చేయలేదని, అభివృద్ధి వైపు మా ప్రభుత్వం గుర్రం స్పీడ్లో దూసుకెళ్తుందన్నారు. జ్యోతిష్యుడి నియామకంపై పునరాలోచన చేస్తామని, మద్దతు తెలిపిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు సీఎం జోసఫ్ విజయ్. మాకు ఓటు వేయనివారి కోసం కూడా ఈ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
ఐదేళ్లు అధికారంలో ఉంటుందన్న సీఎం విజయ్
అంతకుముందు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. ఈ సందర్బంగా విజయ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ మెజార్టీ సాధించలేకపోయిందన్నారు. మెజార్టీ ప్రజలు టీవీకే పార్టీకి ఓటు వేయలేదన్నారు. 65 శాతం ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని, అవినీతి పార్టీలతో చేతులు కలిపి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు.
దీనికి నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు. మరోవైపు బలపరీక్షకు ముందు తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. అన్నాడీఎంకే పార్టీ సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకెలో వేలుమణి వర్గం మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వడంపై మాజీ సీఎం పళనిస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ALSO READ: ములాయం కుటుంబంలో అంతులేని విషాదం.. చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ అకాల మరణం
మా ఎమ్మెల్యేలంతా విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని చెప్పారు పళనిస్వామి. అనంతరం తన వర్గం ఎమ్మెల్యేలతో ఆయన సభ నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు అన్నాడీఎంకె మరొక గ్రూప్ ఎమ్మెల్యేలంతా విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపింది. అసెంబ్లీలో అన్నాడీఎంకెలో వేలుమణి వర్గానికి శాసనసభా పక్షనేతగా అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది.
మాజీ సీఎం పళనిస్వామి మాట్లాడుతూ తమ పార్టీలను సీఎం విజయ్ ప్రలోభపెట్టారని ఆరోపించారు. డబ్బు ఆఫర్ చేశారంటూ తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ఇప్పటికీ తమ పార్టీ ఐక్యంగా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. ఫలితం మరోలా వచ్చిందని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం పళనిస్వామి వ్యాఖ్యలను రెబల్ నేత వేలుమణి తీవ్రంగా ఖండించారు.
విజయ్ ప్రభుత్వానికి 144 మంది మద్దతు
TVK-106, కాంగ్రెస్-5, లెఫ్ట్-4, VCK-2, IUML-2 ఓటింగ్
విజయ్కు మద్దతుగా ఓటేసిన 25 మంది అన్నాడీఎంకే వేలుమణి వర్గం ఎమ్మెల్యేలు
ఓటింగ్కు దూరంగా PMK-4, BJP-1
మ్యాజిక్ ఫిగర్ 117 కంటే 27 మంది ఎక్కువ ఎమ్మెల్యేల మద్దతు
144 people support… https://t.co/n6fgdd9WFf pic.twitter.com/20kWEhiicy
— BIG TV Breaking News (@bigtvtelugu) May 13, 2026