Coimbatore Girl Murder: తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలో పదేళ్ల బాలిక కిడ్నాప్ ఉదంతం.. విషాదాంతంగా మారింది. బాలిక మృతదేహాన్ని గాయాలతో ఓ సరస్సు వద్ద పోలీసులు గుర్తించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓ చిన్నారిపై జరిగిన తొలి దాడి కావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి సీఎం విజయ్ పైకి వెళ్లింది. చిన్నారులు, మహిళల సంరక్షణకు తన ప్రభుత్వం కృష్టి చేస్తుందని హామీ ఇచ్చిన విజయ్.. బాలిక హత్యపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ తమిళనాట మెుదలైంది. ఈ నేపథ్యంలో సీఎం విజయ్ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
పదేళ్ల బాలిక కిడ్నాప్, ఆపై దారుణ హత్యపై సీఎం విజయ్ ఎక్స్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోనని పేర్కొన్నారు. ‘కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలిక దారుణ హత్య ఘటన తీవ్ర దుఖాన్ని, దిగ్భ్రాంతిని కలిగించింది. ఇలాంటి అమానుషమైన క్షమించరాని నేరపూరిత చర్యలను సమాజంలో ఎన్నటికీ సహించలేం. ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితుల్ని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు’ అని సీఎం విజయ్ పోస్ట్ పెట్టారు.
கோயம்புத்தூரில் நேற்று 10 வயது சிறுமிக்கு நிகழ்ந்த கொடூர சம்பவம் மிகுந்த வேதனையையும், அதிர்ச்சியையும் அளிக்கிறது. இத்தகைய மனிதநேயமற்ற மற்றும் மன்னிக்க முடியாத குற்றச் செயல்கள் நமது சமூகத்தில் ஒருபோதும் ஏற்றுக்கொள்ளப்பட முடியாது.
தங்கள் உயிருக்குயிரான குழந்தையைப் பிரிந்து வாடும்…
— CMOTamilNadu (@CMOTamilnadu) May 23, 2026
బాలిక హత్యకు సంబంధించి నిందితులను అరెస్టు చేయడంతో పాటు.. వేగంగా దర్యాప్తు పూర్తి చేసి చార్జ్ షీట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు సీఎం విజయ్ ఎక్స్ లో తెలిపారు. ఇందుకు సంబంధించి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. మహిళలు, పిల్లలపై ఇటువంటి హేయమైన చర్యలకు పాల్పడే వారికి చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా తమిళనాడు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని విజయ్ భరోసా కల్పించారు. ఇందుకోసం తక్షణమే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.
కోయంబత్తూర్ జిల్లా సూలూర్ ప్రాంతంలోని తన ఇంటి దగ్గర సరుకులు కొనడానికి వెళ్లిన బాలికను.. నిందితులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఘటన అనంతరం బాలిక తల్లిదండ్రులు వెంటనే సూలూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. బాలిక మృతదేహం సరస్సు సమీపంలో లభ్యమైంది. ఈ ఘటనకు సంబంధించి కార్తిక్, మోహన్ రాజ్ అనే ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు తమ బిడ్డ మృతిని తట్టుకోలేక బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చినా.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
Also Read: ఫ్రిడ్జ్ అక్కర్లేదు.. కానీ నీళ్లు ఐస్లా చల్లబడతాయ్.. 3,000 ఏళ్ల నాటి అద్భుత టెక్నిక్!
మరోవైపు తమిళనాడు మంత్రి ఎం.ఎస్. సంపత్.. ఈఎస్ఐ ఆస్పత్రిని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఈ కేసు గురించి సీఎం విజయ్ తో మాట్లాడినట్లు చెప్పారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులకు అత్యంత కఠిన శిక్ష విధిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు టీవీకే ప్రభుత్వం ఏర్పడిన 12 రోజుల్లో రాష్ట్రంలో నేరాల గ్రాఫ్ పెరిగిందని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ నెట్టింట తీవ్ర విమర్శలు చేశారు. 12 రోజుల్లో 30 ప్రధాన నేరాలు జరిగాయని.. ఇవి రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలపై తీవ్ర సందేహాలను లేవనెత్తుతున్నాయని ఎక్స్ లో పేర్కొన్నారు.
Also Read: బీఆర్ఎస్ అధికారంలోకి.. వచ్చేది లేదు సచ్చేది లేదు.. టీపీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్