Mahesh Kumar Goud: హైదరాబాద్ గాంధీ భవన్ లో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. ఫ్యూచర్ సిటీ పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు తనదైన శైలిలో ఘాటు సమాధానం ఇచ్చారు. ‘బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది లేదు.. చచ్చేది లేదు’ అంటూ వ్యాఖ్యానించారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేయడానికి ఆ పార్టీ అధికారంలోకి రావాలి కదా? అంటూ సెటైర్లు వేశారు. గత పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారంటూ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రజలకు ఉపయోగపడే వాటిని కొనసాగిస్తున్నట్లు ఆయన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ.. తెలంగాణ రాష్ట్రానికి తలమానికం కాబోతోందని అన్నారు. ఫోర్త్ సిటీ అన్ని హంగులతో రూపుదిద్దుకుంటోందని.. దీని కారణంగా గ్లోబల్ సమ్మిట్ లో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలియజేశారు. విద్య, వైద్యం, హోటల్ టెక్నాలజీ ఫ్యూచర్ సిటీలో రాబోతున్నాయని టీపీసీసీ చీఫ్ సంతోషం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ ను ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అభివృద్ధి చేస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ కొనియాడారు. కానీ కేంద్రం మాత్రం ఇందుకు సరిగా సపోర్ట్ చేయడం లేదని విమర్శించారు. తెలంగాణపై సవితి తల్లి ప్రేమ చూపిస్తోందని అన్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చి ఏం చేశారని ప్రశ్నించారు. మరోవైపు మంత్రి వర్గంతో పీసీసీకి ఎలాంటి సంబంధం లేదని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేబినేట్ సీఎం రేవంత్ రెడ్డి చూసుకుంటారని అన్నారు. అందులో తన ప్రమేయం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ల పేర్లను ఏఐసీసీకి పంపించామని. త్వరలోనే వాటిని ప్రకటిస్తామని మహేశ్ కుమార్ గౌడ్ తెలియజేశారు.
Also Read: తెలంగాణలో బీజేపీ కొత్త స్కెచ్.. రైతులు, కార్మికుల కోసం స్పెషల్ ప్రోగ్రాం..?
మరోవైపు ఇటీవల తనపై వచ్చిన వార్తల గురించి కూడా మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. తనపై తప్పుడు వార్తలు రాస్తే నమ్మే పరిస్థితి లేదని అన్నారు. తన పనితీరు ఏంటో క్యాడర్ కు తెలుసని ధీమా వ్యక్తం చేశారు. తాను ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకున్నానని చెప్పారు. తనపై వచ్చిన వార్తల గురించి స్పందించవద్దని పార్టీ నేతలకు చెప్పినట్లు టీపీసీసీ చీఫ్ చెప్పారు. కొన్ని మీడియా సంస్థ లకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయని.. దానికి తానేం చేయలేనని అన్నారు. ఏఐసీసీ దృష్టిలో తెలంగాణ పీసీసీ ది బెస్ట్ అని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
Also Read: సెంట్రింగ్ కార్మికుల ధర్నాకు కవిత సపోర్ట్.. ప్రభుత్వానికి అల్టిమేటం.. చర్చలకు రాకుంటే!