Tamilnadu Sanitary Worker: రోడ్డుపై పది రూపాయలు దొరికితే చటుక్కున జేబులో పెట్టుకునే రోజులివి. అలాంటి 45 సవర్ల బంగారం దొరికిందంటే.. ఏం చేస్తామో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ తమిళనాడుకు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు తన నిజాయితీని నిరూపించుకుంది. రోడ్డుపై చెత్త సేకరిస్తుండగా దొరికిన సుమారు రూ.45 లక్షల విలువైన 45 సవర్ల బంగారు ఆభరణాలను పోలీసులకు అప్పగించి నిజాయితీని చాటుకుంది.
చెన్నై టీనగర్లో పద్మ అనే శానిటరీ వర్కర్ ఆదివారం మధ్యాహ్నం చెత్త సేకరిస్తుండగా.. రోడ్డుపై ఓ బ్యాగు దొరికింది. ఆ బ్యాగ్ ను తెరచి చూడగా అందులో బంగారు ఆభరణాలు కనిపించాయి. వెంటనే బ్యాగును పాండీ బజార్ పోలీస్స్టేషన్లో అప్పగించింది పద్మ. పోలీసులు దర్యాప్తులో ఆ బ్యాగు నంగనల్లూర్కు చెందిన రమేశ్కు చెందినదిగా గుర్తించారు. బ్యాంకుల్లో వేలం వేసే బంగారు ఆభరణాలను పాడుకుని, విక్రయిస్తుంటారు రమేశ్. అలా వేలంలో దక్కించుకున్న ఆభరణాలను తీసుకుని వెళ్తుండగా టీనగర్లో పడిపోయాయి. బ్యాగు పడిపోవడంతో ఆయన పాండీ బజార్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇంతలో బంగారు ఆభరణాలు దొరికాయని పద్మ పోలీసులకు తెలిపింది. ఆ నగలను యజమానికి అందజేశారు. నిజాయితీగా నగలను తిరిగి ఇచ్చిన పద్మను పోలీసులు అభినందించారు.
Also Read: సీటు కోసం బస్సులో రచ్చ రచ్చ.. జుట్టు పట్టుకుని కొట్లాడుకున్న వీడియో మీరూ చూసేయండి!
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పద్మ.. నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ అంటూ ప్రశంసిస్తున్నారు. తన నిజాయితీని చాటుకున్న పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ ప్రశంసించారు. ఆమెకు ప్రశంసించి రూ.లక్ష చెక్కును అందజేశారు.