Political Parties: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు మారాయి. వారి ఆదాయం ఏంటి? ఆదాయం పెరిగిందా.. తగ్గిందా? ఏడీఆర్ నివేదిక ఏం చెబుతోంది? దేశంలోని 36 ప్రాంతీయ పార్టీలకు 2024-25 ఏడాదిలో దాదాపు రూ.1,192 కోట్ల ఆదాయం వచ్చినట్లు తేల్చింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్-ఏడీఆర్ సంస్థ.
దేశంలో ప్రాంతీయ పార్టీల ఆదాయాల తారుమారు
2024-25 ఏడాదిలో దేశంలోని ఐదు ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో దాదాపు 69 శాతం వాటాను దక్కించుకున్నాయి. మొత్తం వ్యయంలో 77 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయని ఏడీఆర్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. దేశంలో మొత్తం 67 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆడిట్ నివేదికలు సమర్పించిన 36 పార్టీల గణాంకాలను విశ్లేషించింది ఏడీఆర్ సంస్థ.
ఈ మేరకు ఆయా పార్టీల వివరాలను వెల్లడించింది. ప్రాంతీయ పార్టీలలో తెలుగుదేశం పార్టీ అత్యధికంగా రూ. 228.31 కోట్ల ఆదాయాన్ని సాధించింది. మొత్తం వచ్చిన ఆదాయంలో ఆ పార్టీ వాటా 19.14 శాతం. రుసుములు-చందాల ద్వారా రూ.120.03 కోట్లు వచ్చాయి. స్వచ్ఛంద విరాళాల రూపంలో రూ.85.20 కోట్లు, బ్యాంకుల్లోని డిపాజిట్లపై వడ్డీ రూపంలో రూ.23 కోట్లు, ఇతర మార్గాల ద్వారా రూ.0.05 కోట్లు వచ్చినట్టు ప్రస్తావించింది.
టాప్లో టీడీపీ, ఆ తర్వాత టీఎంసీ
ఆ తర్వాత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ రూ.219.35 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. పర్సెంటేజ్ రూపంలో చూస్తే 18.39 శాతం అన్నమాట. వైసీపీకి రూ.140.38 కోట్లు, బీఆర్ఎస్ రూ.123.67 కోట్లు, బీజేడీ రూ.110.13, అన్నాడీఎంకె రూ.86 కోట్లు, జనసేన రూ.64 కోట్ల ఆదాయాన్ని సంపాదించాయి.
2023-24 ఏడాదిలో 36 పార్టీలకు రూ.2,463.17 కోట్ల ఆదాయం రాగా, 2024-25 నాటికి అది కాస్త రూ.1,192.94 కోట్లకు పడిపోయింది. బీఆర్ఎస్కు ఆదాయం రూ.561 కోట్లు, టీఎంసీ రూ.427 కోట్లు, బీజేడీ-రూ.187 కోట్లు, ఆర్జేడీ- రూ.72 కోట్లు, టీడీపీ రూ.56 కోట్లు, వైసీపీకి రూ.50 కోట్ల మేరా తగ్గినట్టు ఆ నివేదికలో పేర్కొంది.
ALSO READ: కాబోయే భర్త వేధింపులు.. ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ సూసైడ్ అటెంప్ట్.. అసలేం జరిగిందంటే?
వ్యయం పరంగా వైసీపీ రూ. 340.20 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. బిజు జనతాదళ్ రూ. 288.44 కోట్ల వ్యయంతో సెకండ్ ప్లేస్ కాగా, ఏఐటిసి రూ. 227.59 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొంది. 2024-25లో 36 ప్రాంతీయ రాజకీయ పార్టీల మొత్తం ఆదాయం 51 శాతం కంటే తగ్గిందని నివేదిక పేర్కొంది. 21 పార్టీలు తమ ప్రకటించిన ఆదాయాన్ని మించి ఖర్చు చేసినట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది.
మిగిలిన 31 పార్టీలు తమ ఆడిట్ నివేదికలను ఇంకా సమర్పించలేదు. డీఎంకే, శివసేన, శివసేన (యూబీటీ), ఎన్సీపీ, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలతో కూడిన 31 ప్రాంతీయ పార్టీలు 2024-25 ఏడాదికి సంబంధించిన తమ ఆడిట్ నివేదికలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదని ఆ నివేదిక హైలైట్ చేసింది.