Makara Jyothi 2026: శబరిమల.. అయ్యప్ప స్వామి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే మకర జ్యోతి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి తరలి వస్తుంటారు.. అలాంటి జ్యోతి 2026 ఏడాది జనవరి 14న అనగా బుధవారం భక్తులకు దర్శనం ఇవ్వనుంది.
అయితే సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే మకర సంక్రమణ ఘడియ మధ్యాహ్నం 3:13 PM కు జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం, సుమారు 6:30 PM నుండి 6:55 PM మధ్య శబరిమల కొండలకు ఎదురుగా ఉన్న పొన్నంబలమేడు పర్వతంపై దివ్యమైన మకర జ్యోతి మూడు సార్లు భక్తులకు దర్శనమిస్తుంది.
ఈ మకర జ్యోతి దర్శనం అయ్యప్ప స్వామి వారి దైవిక ఉనికికి సంకేతంగా భక్తులు విశ్వసిస్తారు. అయితే పురాణాల ప్రకారం, అయ్యప్ప స్వామి తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చిన తర్వాత ఈ రోజే మకర జ్యోతి రూపంలో జ్యోతిర్మయుడై భక్తులకు అభయమిచ్చారని చెబుతారు. 41 రోజుల పాటు కఠినమైన మాలధారణ దీక్షను పాటించే భక్తులకు, ఈ జ్యోతి దర్శనం వారి దీక్షా ఫలాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం.
అయితే మకర జ్యోతి దర్శనానికి ముందు పందళ రాజవంశీకులు పంపే ‘తిరువాభరణాలు’ సన్నిధానానికి చేరుకుంటాయి. పందళం ప్యాలెస్ నుండి బయలుదేరిన ఈ ఆభరణాల పెట్టెలు మూడు రోజుల పాటు భక్తుల జయజయధ్వానాల మధ్య ఊరేగింపుగా శబరిమలకు వస్తాయి. ఈ ఆభరణాలను స్వామివారికి అలంకరించిన తదుపరి జరిగే మహా హారతి సమయంలోనే ఆకాశంలో మకర జ్యోతి వెలుగుతుంది.
మకర జ్యోతికి, మకర విళక్కుకు మధ్య చిన్న వ్యత్యాసం ఉంది. ఆకాశంలో కనిపించే నక్షత్రాన్ని ‘మకర జ్యోతి’ అని, పొన్నంబలమేడు కొండపై వెలిగే దీపాన్ని ‘మకర విళక్కు’ అని పిలుస్తారు. పూర్వం గిరిజనులు అక్కడ చేసే ఈ జ్యోతి వెలిగించే సంప్రదాయం ఇప్పుడు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ దివ్య వెలుగును చూడటం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
మకర జ్యోతిని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు శబరిమలకు చేరుకుంటారు. సన్నిధానంతో పాటు పంప, పుల్మేడు, మాలికాపురం వంటి ప్రాంతాల నుండి జ్యోతి స్పష్టంగా కనిపిస్తుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్వం బోర్డు భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, వైద్య సౌకర్యాలు, రవాణా ఏర్పాట్లను చేస్తుంది. జనవరి 19 వరకు స్వామివారి దర్శనం కొనసాగి, జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తారు.
Also Read: బంగారం ఒకవైపు.. మల్లెపూలు మరోవైపు.. రికార్డు స్థాయిలో పెరిగిన మల్లెల ధరలు..
మకర జ్యోతి దర్శనం కోసం వచ్చే భక్తులు వర్చువల్ క్యూ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకోవడం అనివార్యం. పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించడం వల్ల సమయానుకూలంగా ప్రణాళిక వేసుకోవాలి. పర్వత ప్రాంతాలలో వాతావరణ పరిస్థితులను గమనిస్తూ, అధికారుల సూచనలు పాటిస్తూ సురక్షితంగా స్వామివారిని దర్శించుకోవాలి.