Odisha Encounter: మావోయిస్టు ఏరివేత కార్యక్రమం చివరి అంకానికి చేరింది. ఛత్తీస్ఘడ్ మొత్తాన్ని గుప్పెట్లోకి తీసుకున్న భద్రతా బలగాలు, ఒడిషాపై ఫోకస్ చేశాయి. తాజాగా గురువారం ఉదయం భద్రతా బలగాలు-మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోలు హతమయ్యారు. అందులో ఓ అగ్రనేత ఉన్నారు. ఆయన నల్గొండ జిల్లాకు చెందినవాడు.
ఒడిషాలో భారీ ఎన్కౌంటర్.. మావో అగ్రనేత గణేష్ హతం
ఒడిషాలోని కందమాల్ జిల్లాలో గురువారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు-మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోలు మృతి చెందారు. మావోయిస్టుల అగ్రనేత, కేంద్ర కమిటీ సీనియర్ సభ్యుడు గణేష్ ఉయ్కేతోపాటు నలుగురు హతమయ్యారు. వారిలో ఓ మహిళ కూడా ఉంది.
దీంతో మావోయిస్టు నాయకత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. 69 ఏళ్ల గణేష్ ఉయ్కేపై భారీగా బహుమతి ఉంది. ఒడిశా-ఛత్తీస్ఘడ్-ఏపీ ప్రాంతాలలో చురుకుగా పని చేస్తున్న అగ్రశ్రేణి నేతల్లో ఆయన కూడా ఒకడు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి బలగాలు.
గణేష్ సొంతూరు నల్గొండ జిల్లా వాసి, అతడిపై కోటిపైగానే రివార్డు
కందమాల్ జిల్లా-గంజాం జిల్లాల సరిహద్దుల్లోని గుమ్మా అటవీ ప్రాంతంలో భారీగా మావోయిస్టులు ఉన్నట్లు బలగాలకు సమాచారం అందింది. దీంతో అటవీ ప్రాంతాన్ని 20 స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్-SOG, రెండు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్-CRPF, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF బృందాలతో కూడిన మొత్తం 23 బృందాలు గాలింపు చేపట్టాయి.
ఈ క్రమంలో లొంగిపోవాలని మావోలను.. బలగాలు హెచ్చరించాయి. తొలుత మావోయిస్టుల నుంచి కాల్పులు మొదలయ్యాయి. ఆత్మరక్షణ కోసం భద్రతా దళాలు ఫైరింగ్ మొదలుపెట్టారు. దాదాపు నాలుగైదు గంటలపాటు ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు.
మావోల నుంచి కాల్పులు ఆగిపోవడంతో గాలింపు మొదలుపెట్టాయి బలగాలు. ఘటనా స్థలంలో ఒక రివాల్వర్, 303 రైఫిల్, ఒక వాకీ-టాకీ సెట్ని స్వాధీనం చేసుకున్నాయి. పరారైన వారికోసం ఒడిషా-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ALSO READ: దేశవ్యాప్తంగా హైఅలర్ట్.. ఐఎస్ఐ కుట్రపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక
మరణించిన మావోయిస్టులలో ఒకర్ని గణేష్ ఉయ్కేగా గుర్తించారు. అతడు కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిషాలో మావోయిస్టుల అగ్రనేత కూడా. ఆ రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేతల్లో ఒకడు. అతడి తలపై వివిధ రాష్ట్రాల్లో కోటి నుంచి ఐదు కోట్లకు పైగానే రివార్డు ఉంది. మిగిలిన ముగ్గురు మావోయిస్టుల గుర్తించాల్సివుంది.
సీపీఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పని చేస్తున్న గణేష్, నాలుగు దశాబ్దాలుగా మావోల ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టు బలాన్ని పెంచడంలో అతడిది కీలక పాత్ర. గణేష్ ఉయికే నల్లొండ జిల్లా చెందిన వ్యక్తి. డిగ్రీ వరకు చదివినట్టు పోలీసులు తెలిపారు.