Sircilla District: సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తుంది. దీంతో స్థానిక ప్రజలను, భక్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. రాజన్న దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన భక్తులపై ఒక పిచ్చికుక్క విచక్షణారహితంగా దాడికి తెగబడింది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే సుమారు 25 మందిని కరిసి తీవ్రంగా గాయపరచడం అక్కడ నెలకొన్న పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ముఖ్యంగా గుడి పరిసర ప్రాంతాల్లో, వీధుల్లో సంచరిస్తున్న ఈ కుక్క దారివెంట వెళ్తున్న వారిని వెంబడించి మరీ కరుస్తోంది. ఈ దాడిలో గాయపడిన బాధితులలో చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. గాయపడిన వారందరినీ వెంటనే వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారందరూ అక్కడ చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో అక్కడ కోలాహలం నెలకొంది.
ఈ ఘటనపై స్థానికులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల బెడదపై, ముఖ్యంగా ఈ పిచ్చికుక్క సంచారంపై మున్సిపల్ అధికారులకు ముందే ఫిర్యాదు చేసినప్పటికీ, వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. “మున్సిపల్ యంత్రాంగం సకాలంలో స్పందించి ఉంటే ఇంతమంది గాయపడేవారు కాదు” అని స్థానికులు వాపోతున్నారు.
పవిత్ర పుణ్యక్షేత్రంలో భక్తుల భద్రతను గాలికొదిలేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ పిచ్చికుక్కను పట్టుకొని భక్తులకు, స్థానికులకు రక్షణ కల్పించాలని అందరూ కోరుతున్నారు.
ALSO READ: Palnadu District: తక్కువ ధరకే నగలు చేస్తానని.. రూ.10 కోట్లు విలువ చేసే బంగారంతో జంప్, పల్నాడులో ఘటన!