తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఎన్నికల బరిలో తొలిసారి నిలుస్తున్న ఈ పార్టీ చుట్టూ ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. విజయ్కు ఒక ప్రముఖ జాతీయ పార్టీ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు టీవీకే ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున వెల్లడించడం ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యమంత్రి పదవితో పాటు 50 శాతం అసెంబ్లీ సీట్లను కేటాయిస్తామని సదరు పార్టీ ప్రతిపాదించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను విజయ్ సున్నితంగా తిరస్కరించారని స్పష్టం చేశారు.
ఆధవ్ అర్జున సదరు పార్టీ పేరును మాత్రం నేరుగా ప్రస్తావించలేదు. అయితే విజయ్ ఢిల్లీకి లొంగిపోయే వ్యక్తి కాదని వ్యాఖ్యానించడం ద్వారా అది బీజేపీయేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే ఉద్దేశం విజయ్కు లేదని అర్జున వివరించారు. అధికార దాహం కన్నా ప్రజల నమ్మకమే ముఖ్యమని తన నాయకుడు నమ్ముతున్నారని ఆయన చెప్పారు. పొత్తుల కోసం సదరు పార్టీ 50 నుంచి 90 సీట్ల వరకు ఆఫర్ ఇచ్చిందని అయినా విజయ్ ఒంటరి పోరుకే మొగ్గు చూపారని తెలిపారు.
మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సైతం విజయ్తో చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని 55 స్థానాలు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఎన్డీయేలోని ఇతర మిత్రపక్షాలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అన్నాడీఎంకే ఈ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టీవీకేతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అధినేత ఎడప్పాడి పళనిసామి ఇప్పటికే స్పష్టం చేశారు. విజయ్ కూటమిలోకి వస్తే తమ ప్రాధాన్యత తగ్గుతుందని అన్నాడీఎంకే ఆందోళన చెందుతోంది.
తమిళనాడులో డీఎంకే బలాన్ని తగ్గించాలంటే బలమైన కూటమి అవసరమని బీజేపీ భావిస్తోంది. సినీ గ్లామర్ ఉన్న విజయ్ తోడైతే స్టాలిన్ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడవచ్చని కమలనాథుల వ్యూహం. ఇందుకోసం అన్నాడీఎంకేలోని విభేదాలను పరిష్కరించే ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతం విజయ్ తన సైద్ధాంతిక వైఖరిని స్పష్టంగా ప్రకటించారు. బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా డీఎంకేను రాజకీయ శత్రువుగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగానే 234 స్థానాల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. చూద్దాం తమిళనాడు రాజకీయ పోరులో ఎవరు నెగ్గుతారో…..