Twisha Suicide Case: అత్తింట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న నటి ట్విషా కేసుకు సంబంధించి గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్విషా అత్త, మాజీ న్యాయమూర్తి గిరిబాల సింగ్ ను భోపాల్ లో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ ను రద్దు చేయడంతో ఇవాళ ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరణానికి ముందు ట్విషా శరీరంపై గాయాలు ఉండటం, ఆమెను గిరిబాల మానసికంగా వేధించినట్లు వాట్సప్ చాట్ లో బయటపడటంతో ఈ అరెస్టు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే గిరిబాల అరెస్టుకు సంబంధించి మధ్యప్రదేశ్ అడ్వకేట్ జనరల్ ప్రశాంత్ సింగ్ కీలక విషయాలు వెల్లడించారు. ‘మరణానికి ముందు ట్విషా శరీరంపై 7 గాయాలు ఉన్నాయి. పలు నోటీసులు పంపినప్పటికీ గిరిబాల సింగ్ స్పందించలేదు. ట్విషా శర్మను ఆమె మానసికంగా వేధించినట్లు వాట్సప్ సందేశాలు లభించాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని గిరిబాల సింగ్ ముందస్తు బెయిల్ ను హైకోర్టు తిరస్కరించింది’ అని ఆయన చెప్పుకొచ్చారు.
అంతకుముందు ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు సందర్భంగా బాధిత కుటుంబం తరపు న్యాయవాదులు కీలక విషయాలను కోర్టుకు తెలియజేశారు. ట్విషా తీవ్ర స్థాయిలో మానసిక వేధింపులకు గురయ్యారని పేర్కొన్నారు. వైవాహిక జీవితంలో అనేక కష్టాలు పడ్డారని వాదించారు. మరోవైపు పెళ్లైన తొలి రోజు నుంచే ట్విషాను భర్త సమర్ధ్ సింగ్, అత్త గిరిబాల సింగ్ వేధించినట్లుగా బాధితురాలి తల్లిదండ్రుల వాంగ్మూలాలను కోర్టు పరిగణలోకి తీసుకుంది. అంతేకాకుండా ఆధారాలను తారుమారు చేసేందుకు గిరిబాల సింగ్ యత్నించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ ను రద్దు చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
Also Read: అమ్మబాబోయ్.. ఎకరం ఏకంగా రూ. 237 కోట్లు.. హైదరాబాద్లో ఎక్కడంటే?
మరోవైపు ట్విషా భర్త సమర్థ్ సింగ్ ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్విషా ఆత్మహత్య తర్వాత 10 రోజుల పాటు పరారీలో ఉన్న సమర్థ్ సింగ్.. గతవారం కోర్టు ఎదుట లొంగిపోయాడు. తల్లి గిరిబాల సింగ్ తో పాటు, సమర్థ్ సింగ్ ప్రస్తుతం తీవ్రమైన వరకట్న వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా, మే 12న ట్విషా ఆత్మహత్య చేసుకోగా.. దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో సీబీఐ ఈ కేసును స్వాధీనం చేసుకోని సోమవారం (మే 25వ తేదీ) నుంచి దర్యాప్తు ప్రారంభించింది.
Also Read: జియో vs ఎయిర్టెల్.. ఒకే ధరతో రూ.3,999 వార్షిక ప్లాన్స్.. రెండింటిలో ఏది బెస్ట్?