Heatwave: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఫలితంగా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం. ఈ ఏడాది ఏప్రిల్ నుండి జూన్ వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వడగాలుల పరిస్థితులు నెలకొంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసినట్టు పేర్కొంది. దీనివల్ల రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఆరోగ్యశాఖ. వడగాలి నివారణకు తగిన ప్రణాళికలను అమలు చేయాలని ఆ లేఖలో సూచన చేసింది.
భగభగ మండుతున్న సూర్యుడు
దేశవ్యాప్తంగా భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్రప్రభుత్వం. ముఖ్యంగా ప్రజారోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేసింది. రాష్ట్రాల సీఎస్లకు ఈ మేరకు కేంద్రం వైద్య ఆరోగ్యశాఖ లేఖ రాసింది.
ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో తూర్పు, మధ్య, వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వడగాలులు వీచే ఉండే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లోని పలు తీర ప్రాంతాలలో సాధారణం కంటే అధికంగా వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం, ఆపై కీలక సూచనలు
దేశంలో నిత్యం ఎండ తీవ్రతను పరిశీలించనున్నటు పేర్కొన్న కేంద్రం, రోజువారీగా ఉష్ణోగ్రతల తీవ్రత, వాతావరణ మార్పుల వివరాలు అందించనున్నట్లు పేర్కొంది. నగరాలు, పట్టణ, జిల్లాల స్థాయిలో వడదెబ్బలను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అందులో ప్రస్తావించింది.
వడదెబ్బ బాధితుల వివరాలను ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫాం-IHIPలో నమోదు చేయాలని ప్రభుత్వాలను కోరింది కేంద్రం. రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతున్న కారణంగా వడదెబ్బ బాధితుల సంఖ్య పెరిగే అవకాశముందని హెచ్చరించింది.
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో చూడాలని ఆదేశించింది. అంతేకాదు ప్రతి ఒక్కరికీ ఎండ తీవ్రతపై అవగాహన కల్పించేందుకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొంది. దీనికితోడు ఎండ తీవ్రత కోసం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది.
ALSO READ: ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ రుజువు కాదు.. ఎందుకో చెప్పిన యూఐడీఏఐ?
జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చల్లటి నీటి సదుపాయం ఏర్పాట్లు చేయాలని ప్రస్తావించింది. నీటిని ఎక్కువగా తీసుకోవాలని, చల్లని ప్రదేశాల్లో ఉండాలని ప్రజలకు సూచించింది ఆరోగ్యశాఖ. ఆసుపత్రుల్లో తాగు నీటి చల్లగా ఉండేందుకు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయాలని కోరింది.
ప్రజలకు సైతం సూచనలు చేసింది. ఎండల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న 11 నుంచి 3 గంటల లోపు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని స్పష్టం చేసింది. దీనికితోడు పిల్లలకు మధ్యాహ్నం వేళ బయటకి రాకుండా తల్లిదండ్రులకు తగిన సూచనలు ఇవ్వాలని పేర్కొంది.
తీవ్రమైన వేడిగాలుల నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఢిల్లీ ప్రభుత్వం. భవన నిర్మాణ పనులపై ఆంక్షలు విధించింది. వేడి గాలుల కారణంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు నిర్మాణ కార్మికులు పని చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. కార్మికులకు విశ్రాంతి తీసుకోవడానికి నీడ కల్పించడం తప్పనిసరి చేసింది. బస్సుల్లో ప్రయాణించే వారి కోసం చల్లటి నీటిని అందించే కోల్డ్ బాక్సులను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు.