ECA On Oil Companies: ఇరాన్ , ఇజ్రాయెల్ వార్ సామాన్యులపై భారం పెంచేస్తుంది. ఇప్పటికే వంట గ్యాస్ ధరలు పెరగడం స్టార్ అయ్యాయి. పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు కూడా పెరుగుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ లాక్ చేయడంతో ముడి చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో దేశంలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా కేంద్రం అలర్ట్ అయింది.
వంట గ్యాస్ నిరంతరాయంగా సరఫరా అయ్యేందుకు చమురు శుద్ధి కర్మాగారాలు, పెట్రోకెమికల్ యూనిట్లపై కేంద్ర ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ (ECA) ను ప్రయోగించింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సోమవారం సాయంత్రం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రొపేన్, బ్యూటేన్, ప్రొపైలిన్, బ్యూటీన్లతో సహా C3, C4 ఉత్పత్తిని ఎల్పీజీ గ్యాస్ కోసం ఉపయోగించాలని సూచించింది. దేశంలోని కంపెనీలు తమ ఎల్పీజీ గ్యాస్ ఉత్పత్తులను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లకు సరఫరా చేయాలని ఆదేశించింది.
వంట గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం ఆయిల్ రిఫైనరీ సంస్థలకు తెలిపింది. పెట్రోకెమికల్ కాంప్లెక్స్లు తమ ఉత్పత్తులను పెట్రోకెమికల్ ఉత్పత్తి లేదా ఇతర ఉపయోగాల కోసం బదిలీ చేయకూడదని మంత్రిత్వ శాఖ నిషేధించింది. ప్రజా ప్రయోజనాల కారణంగా ఎల్పీజీని నిరంతరం ఉత్పత్తి చేయాలని కోరింది. ఎల్పీజీని వంటింటి అవసరాలకు మాత్రమే మాత్రమే సరఫరా చేయాలని చమురు మార్కెటింగ్ కంపెనీలను కూడా కేంద్రం ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ యాక్ట్ అమలులో ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read: 21 రోజుల తర్వాతే గ్యాస్ బుకింగ్.. కొత్త రూల్స్ ఇవే
చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. బ్లాక్ మార్కెట్ విక్రయాలను అరికట్టేందుకు సిలిండర్ల బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను సమీక్షించేందుకు చమురు మంత్రిత్వశాఖ ఓ కమిటీని నియమించింది. దేశంలో పెట్రో ధరలు ఇప్పటికిప్పుడు పెరగబోవని, చమురు కంపెనీల వద్ద సరిపడా నిల్వలున్నాయని కేంద్రం వెల్లడించింది. వచ్చే 6-8 వారాల వరకూ సరిపడిన ముడి చమురు, పెట్రో నిల్వలు ఉన్నాయని తెలిపింది. కృత్రిమ కొరత సృష్టించకుండా నిత్యావసర సరకుల చట్టాన్ని ప్రయోగించింది.