జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి బలం చేకూరుస్తూ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మనసులోని మాటను బయటపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తెగ హాట్ టాపిక్ గా మారింది.
పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన నేరుగా సమాధానమిచ్చారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీడియాకు తెలియకుండా జరగదని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుండే నియోజకవర్గ పరిస్థితులపై తనకు అసంతృప్తి ఉందని గుర్తు చేశారు. ఆ రోజే భవిష్యత్తు కార్యాచరణపై సూచనప్రాయంగా మాట్లాడానని తెలిపారు. పార్టీలో కొనసాగాలా లేదా అనే అంశంపై తీవ్రమైన మథనం జరుగుతోందని ఒప్పుకున్నారు.
ప్రస్తుతానికి తాను ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన వెల్లడించారు. ‘చూద్దాం.. లెట్ ఇట్ సీ’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. పార్టీలో తలెత్తిన అంతర్గత పరిణామాలు, స్థానిక నాయకత్వంతో ఉన్న విభేదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ కార్యకర్తల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. సమయం సందర్భం వచ్చినప్పుడు అందరికీ తెలిసేలా నిర్ణయం ప్రకటిస్తానని హామీ ఇచ్చారు.
మీడియా ద్వారానే తన తదుపరి అడుగును వెల్లడిస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అనవసరపు ఊహాగానాలకు తావులేకుండా నేరుగా ప్రజల ముందుకు వస్తానన్నారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం, కార్యకర్తల గౌరవం కోసం ఏ నిర్ణయానికైనా వెనుకాడబోనని ఆయన మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఈ సమావేశంతో కాంగ్రెస్ అధిష్ఠానానికి ఆయన ఒక పరోక్ష హెచ్చరిక పంపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో తన పట్టు నిరూపించుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.
ALSO READ: BRS workshop: వర్క్ షాప్ కు కేసీఆర్ దూరం.. నేడు తొలిసారి పార్టీ సభ్యులకు ట్రైనింగ్