Love Marriage: కాలేజీ రోజుల్లో లవ్లో పడడం కామన్. చాలా మంది ప్రేమకు తొలి బీజం అక్కడే పడుతుంది. అలాగే ఓ ప్రేమజంట తమ ప్రేమకు వేదికైన కాలేజీలోనే పెళ్లి చేసుకొని ఒక్కటైంది. విద్యార్థుల సమక్షంలో దండలు మార్చుకొని వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ ఘటన కేరళలో జరిగింది.
ఎర్నాకుళంకు చెందిన కేకే నదీమ్, పనంగాడ్కు చెందిన కృపా అనే ఇద్దరు 2014-17లో మహారాజా కాలేజీలో డిగ్రీ చేశారు. ఈ సమయంలో వారికి పరిచయం ఏర్పడి అదికాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి వారి ప్రేమ కొనసాగుతోంది. ఇటీవల పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఇరువురి ఇంట్లో చెప్పడంతో పెద్దలు వారి పెళ్లికి నిరాకరించారు. కులాలు వేరనే కారణంతో పెళ్లికి ఒప్పుకోలేదు.
దీంతో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన నదీమ్, కృపా తమ ప్రేమకు వేదికైన కాలేజీలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో కాలేజీలో యూత్ ఫెస్టివ్ జరుగుతుండడంతో వేలాది మంది విద్యార్ధుల సమక్షంలో పూల దండలు మార్చుకొని ఒక్కటయ్యారు. ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.