Wayanad Landslide: కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి మరోసారి కోరలు చాచింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఘోర ప్రమాదం సంభవించింది. అనక్కంపొయిల్-కల్లాడి సొరంగం (ట్విన్-టన్నెల్) నిర్మాణ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. కల్లాడిలోని మీనాక్షి వంతెన సమీపంలో జరిగిన ఈ విపత్తులో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో అక్కడ పనిచేస్తున్న సుమారు 30 మందికి పైగా కార్మికులు బురద, శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వేగంగా సాగుతున్న సహాయక చర్యలు
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగాయి. స్థానిక పోలీసులు, సివిల్ డిఫెన్స్ వాలంటీర్లతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న కొంతమంది కార్మికులను సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం అక్కడ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి వి.డి. సతీసన్ స్వయంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షిస్తుండగా, తిరువనంతపురం నుండి మంత్రులు టి. సిద్ధిక్, ఎ.పి. అనిల్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటున్నారు.
Also Read: ఏపీ హస్తకళల రేంజ్ మార్చబోతున్న పవన్ కల్యాణ్.. ఆ ‘గ్లోబల్ ప్లాన్’ ఏంటంటే?
బాధిత కుటుంబాలకు ప్రియాంక గాంధీ పరామర్శ
ఈ దారుణ ఘటనపై వాయనాడు ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు తామంతా అండగా ఉంటామని, సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. శిథిలాల కింద ఉన్న తమ వారి కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు.
అలాగే, సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని యూడీఎఫ్ (UDF) నాయకులకు, కార్యకర్తలకు ఆమె విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజలంతా అధికార యంత్రాంగం ఇచ్చే మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ, రెస్క్యూ టీమ్లకు పూర్తి మద్దతు అందించాలని ఆమె కోరారు. ప్రస్తుతం అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఎదురవుతోంది.
వయనాడ్లో విరిగిపడిన కొండచరియలు
కేరళంలోని వయనాడ్లో కురుస్తున్న భారీ వర్షాలకు కొంచరియలు విరిగిపడుతున్నాయి. అనక్కంపొయిల్-కల్లాడి సొరంగం నిర్మాణపనుల వద్ద కొండచరియలు కూలిపోవడంతో కార్మికులు చిక్కుకుపోయారు. దీంతో సహాయక సిబ్బంది రంగంలోకి దిగి కొంతమంది కార్మికులను రక్షించారు.… pic.twitter.com/B0Qwg7bXHV
— ChotaNews App (@ChotaNewsApp) July 7, 2026