కాళేశ్వరంపై ఇద్దరూ ఒకటయ్యారు. ఆ రెండు పార్టీల గళం ఇప్పుడు ఒకేలా వినిపిస్తుంది. అదే కాళేశ్వరంపై. రాష్ట్రంలో బర్నింగ్ రాజకీయం ఇదే. దీన్ని జనాల వద్దకు బలంగా తీసుకుపోవాలని చూస్తున్నది బీఆరెస్. కాళేశ్వరం అంతా కూలేశ్వరమైందని ఇంకెన్ని రోజులు చెబుతారు? అని ఏకంగా కన్నెపల్లి పంప్హౌజ్ వద్ద మోటార్లు చాలు చేస్తారా లేదా? అని భీష్మించుకుని కూర్చున్నది బీఆరెస్.
దీనిపై ఇప్పుడు బీజేపీ కూడా సై అంటున్నది. అంటే కాళేశ్వరం విషయంలో బీఆరెస్ తానా అంటే.. బీజేపీ తందానా అంటున్నదన్నమాట. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నాణ్యతలోపాలున్నాయన్నది కరెక్టే. కానీ ఇంకెన్ని రోజులు ఇదే బూచిని చూపుతూ కూర్చుంటారు. దీన్ని రిపేరు చేయరా…? రాజకీయాల గురించి రైతులను మోసం చేస్తారా? అనే వాయిస్ బీజేపీ నుంచి బలంగా వినిపిస్తోంది.
ఇప్పటికే ఈ అంశంపై బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావు, ఎంపీ ఈటల రాజేందర్ ఇద్దరూ కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడ్డారు. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో ఆటలాడొద్దన్నాడు ఈటల. ఇది కేవలం కాంగ్రెస్ తన రాజకీయ మైలేజీ కోసం ఆపుతున్నదని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, దాని వ్యయం.. అంతా వృథా అయ్యేలా చేయడం దుర్మార్గమని బీఆరెస్ కు సంఘీభావంగానే మాట్లాడాడు ఈటల.
ఈటల ఈ అంశంపై ఇలా మాట్లాడటం ఇది మొదటి సారేం కాదు. గతంలో కూడా ఆయన కాళేశ్వరంపై తన వాయిస్ను తనదైన శైలిలో వినిపించారు. కేసీఆర్ చేసింది రైతుల కోసమేనని, ఫిల్లర్లు కుంగాయనే మిషతో దీన్ని ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా చిత్రీకరించడం తగదని రేవంత్కు హితవు పలికాడు ఈటల.
రాజకీయాలు మారినా.. ఆయన స్టాండ్ మార్చుకోలేదు. వ్యక్తిగతంగా కేసీఆర్ తనకు రాజకీయంగా ఎంతో డ్యామేజీ చేసినా.. కాళేశ్వరం ఉద్దేశ్యం.. దాని ఫలాలు తెలిసిన నేతగా.. దానికి సపోర్టు చేస్తూ వస్తున్నారు. తాజాగా దీనిపై మళ్లీ రగడ ముదరడంతో ఈటల కూడా స్పందించాడు. కేవలం ఇది రేవంత్ డ్రామానే తప్ప.. కాళేశ్వరంను వినియోగించుకోవచ్చని, దీని ద్వారా రైతులకు మేలు జరుగుతుందని ఆయన అంటున్నారు.
మరోవైపు రాంచ్రందారావు కూడా కాంగ్రెస్ను తప్పుబడుతున్నాడు. దీంతో ఇప్పుడు బీఆరెస్కు, ఈ విషయంలో బీజేపీ కూడా తోడైంది. ఎల్నినో ఎఫెక్ట్ అనే అంశం రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో.. కాళేశ్వరం అవసరం ఇప్పుడే ఉంటుందనే విధంగా సరైన సమయంలో దీన్ని తెరమీదకు తెచ్చి కాంగ్రెస్ను డిఫెన్స్లో పడేయాలని చూస్తున్నది బీఆరెస్.
వీరిద్దరి రాజకీయ రగడలో తాము సైలెంట్గా ఉంటే.. రైతుల అంశం పట్టనట్టుగా ఉన్నవారమవుతామని అనుకున్నారో.. లేక.. తమ రహస్య మిత్రపక్షానికి తోడు నిలిచేందుకు ఇదే సరైన సమయమని భావించిందో.. మొత్తానికి బీఆరెస్కు బీజేపీ తందానా అంటోంది. ఈవిషయంలో కాంగ్రెస్ ఒంటరయ్యింది.
కానీ అది తన స్టాండ్ను వదలటం లేదు. జనాలకు మెదళ్లలో ఈ ప్రాజెక్టుపై ఎలాంటి వ్యాఖ్యలు నూరిపోసిందో.. అవే వ్యాఖ్యలకు కట్టుబడి ఉంది సర్కార్. అంతే కాదు.. చుక్క కాళేశ్వరం నీరు వినియోగించకుండానే.. దేశంలోనే నెంబర్ వన్ స్థాయిలో పంటలు సాగయ్యాయని చెప్పుకుంటున్నారు. అంటే ఈ కాళేశ్వరాన్ని కాంగ్రెస్ సర్కార్ ఉన్నన్ని రోజులు ఎండబెట్టుడు.. పండబెట్టుడు.. విధానాన్నే కొనసాగించేలా ఉంది. రాజకీయ వ్యూహంలో ఆ ప్రాజెక్టు బలైపోయిందనే చెప్పాలి.