Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు సుప్రీంకోర్టులో స్వయంగా తన వాదనలను వినిపించనుండడం దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR), కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై ఆమె వేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మమతా బెనర్జీ వర్సెస్ ఎన్నికల సంఘం
చారిత్రాత్మక అడుగు దేశ చరిత్రలో ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి న్యాయస్థానంలో స్వయంగా నిలబడి వాదనలు వినిపించడం ఇదే తొలిసారి కానుంది. మమతా బెనర్జీ వృత్తిరీత్యా న్యాయవాది అయినప్పటికీ, ఆమె ఇప్పటివరకు ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడూ కోర్టులో వాదించలేదు. అయితే, పశ్చిమ బెంగాల్లోని ఓటర్ల జాబితా సవరణలో జరుగుతున్న అన్యాయాలపై నేరుగా అత్యున్నత న్యాయస్థానానికి వివరించాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఇది కేవలం న్యాయపరమైన పోరాటమే కాకుండా, ప్రజాస్వామ్య రక్షణ కోసం చేస్తున్న పోరాటమని ఆమె అభివర్ణించారు.
SIR వివాదం ఏమిటి?
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన Special Intensive Revision (SIR) ప్రక్రియ ద్వారా పశ్చిమ బెంగాల్లోని లక్షలాది మంది ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ ప్రక్రియ అవకతవకలతో కూడుకున్నదని, దీనివల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మమతా బెనర్జీ వాదిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు కూడా గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వస్తోందని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికల సంఘాన్ని బీజేపీ తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని, కావాలనే ప్రతిపక్షాల ఓటు బ్యాంకును దెబ్బతీసేలా SIR నిర్వహిస్తున్నారని మమత ఆరోపిస్తున్నారు. అందుకే న్యాయవాదులకు బాధ్యత అప్పగించకుండా, క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తానే స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనానికి వివరించనున్నారు.
ఈ విచారణ కోసం మమతా బెనర్జీ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఆమె జెడ్ ప్లస్ (Z+) కేటగిరీ భద్రతలో ఉన్నందున, సుప్రీంకోర్టు ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తానే న్యాయవాదిగా మారి వాదించడానికి ఆమె సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి కోరారు. న్యాయవాదిగా కాకుండా, ఒక బాధ్యతాయుతమైన పౌరురాలిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల గొంతుకను వినిపించేందుకు కోర్టు ఆమెకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.
Also Read: ముంబైలో పెను ప్రమాదం.. ఢీ కొన్న రెండు విమానాలు.. చివరకు!
కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థల స్వయం ప్రతిపత్తిపై చర్చ జరుగుతున్న తరుణంలో, మమత తీసుకున్న ఈ నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. సుప్రీంకోర్టు ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుంది? ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి స్టే విధిస్తుంది? అనే అంశాలపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ కేసు ఫలితం రాబోయే బెంగాల్ ఎన్నికల భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనుంది.
న్యాయవాదిగా మారనున్న సీఎం మమతా బెనర్జీ
ఈ రోజు సుప్రీంకోర్టులో SIR మరియు కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ వేసిన కేసులో విచారణ
ఈ క్రమంలో తానే న్యాయవాదిగా మారి వాదించనున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
దేశ చరిత్రలో తొలిసారి ఒక ముఖ్యమంత్రి న్యాయవాదిగా మారి,… pic.twitter.com/VGmTkp0r5D
— BIG TV Breaking News (@bigtvtelugu) February 4, 2026