Mumbai: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒకే సమయంలో రెండు విమానాలు ఒకదానికొకటి తగులుకున్న ఘటన కలకలం రేపింది. ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలకు చెందిన విమానాల రెక్కల భాగాలు (Wings) ఒకదానికొకటి రాసుకున్నాయి. అయితే, ఈ సమయంలో రెండు విమానాల్లోనూ ప్రయాణికులు ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఘటన ఎలా జరిగిందంటే?
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో వచ్చిన ఇండిగో విమానం (6E791) ముంబైలో ల్యాండ్ అయిన తర్వాత టాక్సీ వే మీదుగా వెళ్తోంది. అదే సమయంలో ముంబై నుంచి కోయంబత్తూర్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఎయిర్ ఇండియా విమానం (AI2732) రన్వే సమీపంలో ఆగి ఉంది. ఈ క్రమంలో ఇండిగో విమానం పక్క నుంచి వెళ్తుండగా, రెండు విమానాల రెక్కల కొనలు (Winglets) ఒకదానికొకటి బలంగా తగిలాయి.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే పైలట్లు అప్రమత్తమై విమానాలను నిలిపివేశారు. సమాచారం అందుకున్న గ్రౌండ్ స్టాఫ్, ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. రెండు విమానాల రెక్కల భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సమగ్ర విచారణకు ఆదేశించింది. గ్రౌండ్ కంట్రోల్ వైఫల్యమా లేక పైలట్ల తప్పిదమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: కోల్కతాలో భూకంపం బీభత్సం.. పేకమేడల్లా ఊగిపోయిన భవనాలు, భయాందోళనలో ప్రజలు
అయితే ఈ అనూహ్య ఘటనతో కోయంబత్తూర్ వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సదరు విమానయాన సంస్థలు ప్రయాణికులకు క్షమాపణలు చెప్పి, వారిని వేరే విమానాల్లో పంపేందుకు ఏర్పాట్లు చేశాయి. రద్దీగా ఉండే ముంబై విమానాశ్రయంలో ఇలాంటి ఘటనలు భద్రతా ఏర్పాట్లపై చర్చకు దారితీశాయి. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విమానయాన నిపుణులు సూచిస్తున్నారు.
రన్వేపై ఢీకొన్న రెండు విమానాల రెక్కలు.. తప్పిన ప్రమాదం
ముంబై విమానాశ్రయంలో ప్రయాణికులతో ఉన్న ఎయిరిండియా, ఇండిగో విమానాలకు తప్పిన ప్రమాదం
ముంబై నుంచి కోయంబత్తూర్కు వెళ్లాల్సిన ఎయిరిండియా AI2732 రన్వేపై ఆగి ఉండగా.. హైదరాబాద్ నుంచి ముంబైకి చేరుకున్న ఇండిగో 6E791 ల్యాండింగ్… pic.twitter.com/mqn2CutTyR
— BIG TV Breaking News (@bigtvtelugu) February 4, 2026