Bengal Man Cheats Women: పశ్చిమ బెంగాల్ లో ఓ మాయగాడి ఉదంతం వైరల్ అవుతుంది. ఏకంగా 500 మంది మహిళలను పెళ్లి, ప్రేమ పేరుతో మోసం చేసి రూ.2 కోట్లకు పైగా కొట్టేశాడు. దిల్లీ సైబర్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాలకు చెందిన ఆనంద్ కుమార్.. కొన్నిసార్లు డాక్టర్గా, వ్యాపారవేత్తగా, సినిమా నిర్మాతగా లేదా లాయర్గా నటిస్తూ డేటింగ్, మ్యాట్రిమోనియల్ యాప్ లలో మహిళలను ట్రాప్ చేసేవాడు. మహిళలను మాయమాటలతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని వారితో రిలేషన్ కొనసాగించేవాడు. కొన్నిసార్లు మోడలింగ్ ఛాన్స్, ప్రతిష్టాత్మక కాలేజీల్లో అడ్మిషన్ ఇప్పిస్తానని కూడా మహిళలను ఛీట్ చేశాడు ఆనంద్.
డేటింగ్ చేస్తున్న సమయంలో.. తనను నమ్మిన మహిళలను ఏదో కారణం చెప్పి డబ్బులు అడిగేవాడు. వైద్యం, వ్యాపార నష్టాలు, కుటుంబ సమస్యలు ఇలా ఏదో ఒక కథ అల్లి డబ్బు అడిగేవాడు. డబ్బు చేతికి అందిన వెంటనే.. ఆనంద్ క్యారెక్టర్ మాయమైపోయేది. ఆ ఛాప్టర్ క్లోజ్ చేసి మరో చోటికి మకాం మార్చేసేవాడు.
వైభవ్ అరోరా అనే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తి తనను సుమారు రూ. 7 లక్షలు మోసం చేశాడని ఆరోపిస్తూ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఆనంద్ మాయలు వెలుగులోకి వచ్చింది. వీరిద్దరికీ ఒక డేటింగ్ యాప్లో పరిచయం అవ్వగా, ఆ పరిచయం ఇన్స్టాగ్రామ్ నుంచి వాట్సాప్ మారింది. అరోరా ఆమెకు పెళ్లి చేసుకుంటానని నమ్మించి, రకరకాల సాకులతో డబ్బులు వసూలు చేశాడు. బాధితురాలు డబ్బు తిరిగి ఇవ్వమంటే, ఆ క్యారెక్టర్ క్లోజ్ చేశాడు. చివరికి వైభవ్ అరోరా చనిపోయాడని మాయమాటలు చెప్పాడు. ఈ కేసు దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు దిల్లీ పోలీసులు. నిందితుడి మొబైల్ నంబర్, సోషల్ మీడియా అకౌంట్స్, ఆర్థిక లావాదేవీలను పరిశీలించడంతో దర్యాప్తు స్టార్ట్ అయింది.
పోలీసుల విచారణలో, అరోరాగా నటిస్తుంది పశ్చిమ బెంగాల్ కు చెందిన ఆనంద్ గా తెలిసింది. నిందితుడిని అరెస్టు చేయడానికి సైబర్ పోలీసు బృందం బెంగాల్లో పలుచోట్ల తనిఖీలు చేశారు.
కేసు దర్యాప్తులో ఆనంద్ కుమార్ మహిళలను ట్రాప్ చేసేందుకు వివిధ పేర్లు సృష్టించుకున్నాడని తేలింది. డాక్టర్ రోహిత్ బహల్, తరుణ్, ఆనంద్ శర్మ వంటి వేర్వేరు పేర్లతో ప్రొఫైల్లను నిర్వహించాడని, అంతేకాకుండా శిఖ అనే పేరును కూడా ఉపయోగించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు అనేక మొబైల్ ఫోన్లు, వివిధ సిమ్ కార్డులను ఉపయోగించాడు.
మహిళలను మోసం చేసిన సొమ్ముతో కొనుగోలు చేసిన నాలుగు మొబైల్ ఫోన్లు, ఎనిమిది సిమ్ కార్డులు, మూడు డెబిట్ కార్డులతో పాటు బంగారు గాజులు, గొలుసులను నిందితుడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మోసం చేసి సంపాదించిన సొమ్ములో ఎక్కువ భాగాన్ని ఆన్లైన్ గేమింగ్కు, విలాసవంతమైన జీవితానికి ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై గతంలో దిల్లీ, ఘజియాబాద్లలో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ సిండికేట్లో ఇంకా ఎవరెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read : పలాష్ ముచ్చల్ పెద్ద ఛీటర్..రూ.40 లక్షల భారీ మోసం..స్మృతి స్కెచ్ అదుర్స్ !