West Bengal Re-Polling: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సరిగ్గా రెండ్రోజుల ముందు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదు నేపథ్యంలో రాష్ట్రంలోని 15 పోలింగ్ కేంద్రాల్లో తిరిగి రీపోలింగ్ నిర్వహిస్తోంది. దీంతో ఆయా కేంద్రాల వద్ద శనివారం (మే 2) ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ మెుదలు కాగా.. మరోమారు ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
దక్షిణ 24 పరగణాల జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో పరిధిలో గల మొత్తం 15 బూత్లలో ఈ రీపోలింగ్ జరుగుతోందియ. మగ్రాహత్ పశ్చిమ్ (Magrahat Paschim) నియోజకవర్గంలో 11 పోలింగ్ కేంద్రాలు, డైమండ్ హార్బర్ (Diamond Harbour) అసెంబ్లీ సెగ్మెంట్ లో 4 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు మెుదలైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండు నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల నుండి వచ్చిన నివేదికలను పరిశీలించి.. ఈ రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది.
బెంగాల్లో ఏప్రిల్ 29వ జరిగిన రెండో దశ ఎన్నికల సమయంలో రిగ్గింగ్, ఈవీఎం ట్యాంపరింగ్, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయం వంటి అక్రమాలు జరిగినట్లు వివిధ రాజకీయ పార్టీల నుంచి ఈసీకి భారీగా ఫిర్యాదులు అందాయి. మరీ ముఖ్యంగా మగ్రాహత్ పశ్చిమ్ నియోజకవర్గంలో ఓటర్ల చొక్కా జేబుల్లో స్పై కెమెరాలు ఉంచి వారు ఎవరికి ఓటు వేస్తున్నారో గమనిస్తున్నారని వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీనిపై బీజేపీతో పాటు ఇతర పార్టీలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో క్షేత్రస్థాయిలో రిటర్నింగ్ అధికారుల చేత ఈసీ విచారణ జరిపించింది. అక్రమాలు జరిగాయంటూ నిర్ధారించుకున్న 15 బూత్ లలో ఎన్నికలు రద్దు చేసి.. మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది.
తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్ సభ పరిధిలోనే ఈ రీపోలింగ్ బూత్ లు ఉన్నాయి. డైమండ్ హార్బర్ మగ్రాహాట్ లో భారీ తేడాతో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ.. తిరిగి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసిందని టీఎంసీ నేత కునాల్ ఘోష్ అన్నారు. ప్రజలు తీర్పు బీజేపీకి వ్యతిరేకంగా ఉందన్న ఆయన.. ఎన్ని సార్లు రీపోలింగ్ జరిపినా అది అలాగే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు బెంగాల్లో బీజేపీ సీఎం అభ్యర్థి సువేందు అధికారి.. టీఎంసీపై నిప్పులు చెరిగారు. ప్రజాతీర్పు తమకు అనుకూలంగా ఉండేందుకు అనేక బూతులలో అధికార పార్టీ ఆక్రమాలకు తెరలేపిందని ఆరోపించారు.
Also Read: వేసవిలో మీ బెడ్ వేడిగా ఉంటుందా? ఈ బెడ్షీట్ ఉపయోగిస్తే ప్రశాంతమైన నిద్ర మీ సొంతం
ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న రీపోలింగ్ తో పాటు గత రెండు దశల్లో జరిగిన ఓటింగ్ ప్రక్రియ ఫలితాలను మే 4న ఎన్నికల సంఘం వెల్లడించనుంది. కాగా, ఈ దఫా బెంగాల్ చరిత్రలోనే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. ఏకంగా 92 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. 6.81 కోట్ల ఓటర్లు ఉన్న బెంగాల్ రాష్ట్రంలో.. ఏప్రిల్ 23న జరిగిన తొలిదశ ఎన్నికల్లో 93 శాతం, రెండో దశలో 91 శాతం పోలింగ్ నమోదైనట్లు వివరించింది. అయితే ఈసారి అధికారం చేపట్టే విషయంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య గట్టి ఫైట్ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే మెజారిటీ సర్వేలు బీజేపీపై మెుగ్గుచూపడం గమనార్హం.