Pakistan : మేడమ్ ఎన్. ఈమె అంటేనే హడల్. మేడమ్ నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు.. ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీ వణికిపోతుంది. ఆమె ఎవరి పేరు చెబితే వారికి రెడ్ కార్పెట్ వెల్కమ్ లభిస్తుంది. ఎంట్రన్స్ దగ్గరికే సిబ్బంది ఎదురొస్తారు. సోఫాలో కూర్చోబెట్టి టీ, కాఫీలు అందిస్తారు. కాసేపట్లోనే పాకిస్తాన్ వీసాను పువ్వుల్లో పెట్టి ఇస్తారు. అంతటి పలుకుబడి ఆమెది. అలాగని ఎవరికి పడితే వాళ్లకు రికమెండ్ చేయరు. పాక్కు స్పై గా పనికొస్తారని అనుకుని.. ఎంపిక చేసిన కొందరే ఆమె హిట్ లిస్ట్లో ఉంటారు. వారికి పాకిస్తాన్లో రాచమర్యాదలు అందిస్తారు.
పాక్లో టూర్స్ అండ్ ట్రావెల్స్
ఇండియాలోని పాక్ ఎంబసీలోనే కాదు.. పాకిస్తాన్లోనూ మేడమ్ Nకు ఫుల్ పాపులారిటీ. అక్కడి సైనికాధికారులు, ఐఎస్ఐ పెద్దలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. మేడమ్ చెబితే ఎవరైనా వినాల్సిందే. అలాగని ఆమేమీ టాప్ పొలిటికల్ లీడర్ గట్రా కాదు. పాక్లో ట్రావెల్ అండ్ టూరిజం బిజినెస్ చేస్తుంటారు అంతే. పేరుకు ట్రావెల్సే కానీ.. చేసేది మాత్రం అంతకుమించే. పాకిస్తాన్ కోసం ఇండియాలో స్పై నెట్వర్క్ ఏర్పాటు చేయడమే ఆమె టార్గెట్. ఒకరూ ఇద్దరు కాదు ఏకంగా 500 మంది స్లీపర్ సెల్స్ను రెడీ చేసే దిశగా పని చేస్తున్నారు.
ఇండియన్ ఇన్ఫ్లూయెన్సర్లే టార్గెట్
భారత్లోని ఓ మోస్తారు ఇన్ఫ్లూయెన్సర్లను ముందుగా ఫిల్టర్ చేస్తుంది మేడమ్ ఎన్. వారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తుంది. టూరిజం ముసుగులో మెళ్లిగా వాళ్లతో కాంటాక్ట్లోకి వస్తుంది. పాకిస్తాన్ టూర్కి రమ్మంటూ ఇన్వైట్ చేస్తుంది. ఒప్పుకున్నారో ఇక అప్పటినుంచి ఆమె గేమ్ స్టార్ట్ చేస్తుంది. డబ్బులు ఆశ చూపిస్తుంది. సైనిక రహస్యాలు అడుగుతుంది. పాజిటివ్ సిగ్నల్స్ రాగానే.. పాక్కు విమానం టికెట్స్ పంపిస్తుంది. ఎయిర్పోర్టులో దిగినప్పటి నుంచి ఆ దేశంలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకు గాను లగ్జరీ అకామిడేషన్ చూపిస్తుంది. తిండి, తిరుగుడు అంతా ఆమె ఖర్చులతోనే. ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉంచుతుంది. కాస్ట్లీ ఫుడ్ పెడుతుంది. పాకిస్తాన్ ఆర్మీ పెద్దలను కలిపిస్తుంది. ఐఎస్ఐ ఏజెంట్లతో దోస్తానీ చేయిస్తుంది. ఆ తర్వాత వాళ్లకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లాగేస్తారు.
మనోళ్లు మేడమ్ కస్టమర్లే..
ఇప్పటి వరకు సుమారు 3 వేల మంది ఇండియన్స్ మేడమ్ ఎన్ సాయంతో పాకిస్తాన్లో పర్యటించారనే నిజం తెలిసి ఇంటెలిజెన్స్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. వీరిలో సగం మంది గడిచిన 6 నెలల్లోనే పాక్ వెళ్లివచ్చారని తెలిసి ఉలిక్కిపడుతున్నారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, బయ్యా సన్నియాదవ్, హర్యానాకు చెందిన మరికొంత మంది ఇన్ఫ్లూయెన్సర్లు మేడమ్ ఎన్ కస్టమర్లేనని తెలుస్తోంది. వారిని NIA విచారిస్తుండగానే.. ఆమె మేటర్ బయటపడిందని సమాచారం.
500 మందితో స్లీపర్ సెల్ నెట్వర్క్
హిందూ, సిక్కు ఇన్ఫ్లూయెన్సర్లే ఆమె టార్గెట్. ఢిల్లీలో ట్రావెల్ ఏజెంట్లను పెట్టుకొని మరీ ఇండియన్స్కు పాకిస్తాన్ పర్యటనలు ఫిక్స్ చేయిస్తోంది మేడమ్ ఎన్. అలా టూరిస్టు వీసా మీద పాక్ వెళ్లిన వాళ్లలో కొందరు ఆ తర్వాత పాక్కు స్పై గా పని చేశారనే చేదు నిజం వెలుగుచూస్తోంది. మొత్తం 500 మందితో ఇండియాలో స్లీపర్ సెల్ టీమ్స్ ఏర్పాటు చేయాలని మేడమ్ ఎన్కు పాక్ ఆర్మీ, ఐఎస్ఐ నుంచి ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది. ఆమెకు “మేడమ్ N” అని కోడ్ నేమ్ పెట్టింది కూడా ఐఎస్ఐనే. ఇంతకీ ఆమె అసలు పేరు ఏంటంటే.. ‘నోషబ షెహజాద మసూద్’.