Mythological Thriller OTT : ఇప్పుడంటే ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ట్రెండింగ్ మూవీస్ తెలుస్తున్నాయి. ఒకప్పుడు ఓటీటీలు అందుబాటులో లేని టైమ్ లో టీవీలు రాజ్యం ఏలాయి. అప్పట్లో టీవీ సీరియల్స్ కు ఇప్పుడు సిరీస్ లకు ఉన్నదానికంటే ఎక్కువగానే క్రేజ్ ఉండేది. నచ్చిన సీరియల్ వస్తుందంటే చాలు ప్రజలు అన్నీ పక్కన పడేసి, కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని చూసేవారు. దేశం మొత్తాన్ని షేక్ చేసిన అలాంటి ఒక సీరియల్ గురించి ఈరోజు తెలుసుకుందాం.
ఇప్పటి తరం ఆడియన్స్ ను “పంచాయత్,” “గుల్లక్,” “ది ఫ్యామిలీ మ్యాన్”, “పాతాళ్ లోక్” వంటి కొత్త వెబ్ సిరీస్ లు ఆకర్షిస్తున్నాయి, కానీ 90లలో దేశంలోని ప్రతీ మూలన మారుమ్రోగిన ఒక టీవీ షో ఉంది. COVID-19 మహమ్మారి సమయంలో రీరిలీజ్ చేస్తే బుర్రపాడు రెస్పాన్స్ దక్కింది దానికి. టెలివిజన్ సీరియల్స్ ప్రపంచంలో దీనికే IMDbలో 9 రేటింగ్ ఉండడం విశేషం. మనం ఇప్పుడు దూరదర్శన్ పాపులర్ సీరియల్ “రామాయణం” గురించి మాట్లాడుతున్నాము. ఇది కేవలం ఒక టీవీ షో కాదు. దాని సృష్టికర్త రామానంద్ సాగర్ను అమరత్వంలోకి తెచ్చిన సీరియల్.
రామానంద్ సాగర్ ఇప్పుడు మన మధ్య లేకపోయినా, “రామాయణం” అనే పేరు ప్రస్తావించినప్పుడల్లా ఆయన ఫేస్ గుర్తుకు వస్తుంది. దూరదర్శన్ ప్రసిద్ధ టీవీ సీరియల్ “రామాయణం” మొదటిసారి 1987 జనవరి 25న ప్రసారం అయింది. చివరి ఎపిసోడ్ 1988 జూలై 31న వచ్చింది. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు దూరదర్శన్లో ప్రసారం అయ్యేది. మొత్తం 78 ఎపిసోడ్లుగా నడిచింది. రామానంద్ సాగర్ రచన, నిర్మాణం, దర్శకత్వం వహించిన ఈ సీరియల్ మహర్షి వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందింది. ఇందులో శ్రీరాముడి జీవితం, వనవాసం, సీత అపహరణ, రావణుడితో అతని యుద్ధం, చివరికి అయోధ్యకు తిరిగి రావడం, పట్టాభిషేకం వంటి అంశాలను అద్భుతంగా చూపించారు. ఈ సీరియల్ ధర్మం, సత్యం, త్యాగం, గౌరవం అనే ఆదర్శాలను ప్రతి ఇంటికి తీసుకువచ్చింది. ఇందులో అరుణ్ గోవిల్ శ్రీరాముడిగా, దీపిక చిఖాలియా సీతగా, సునీల్ లాహిరి లక్ష్మణుడిగా, దారా సింగ్ హనుమంతుడిగా, అరవింద్ త్రివేది రావణుడి పాత్రలో నటించారు. ‘రామాయణం’ కేవలం ఒక టీవీ షో మాత్రమే కాదు, భారతీయ టెలివిజన్ చరిత్రలో ఒక బిగ్గెస్ట్ మైలురాయిగా మారింది.
Read Also : పెళ్లయ్యాక భార్య అమ్మాయి కాదని తెలిస్తే… హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ భయ్యా
“రామాయణం” దాని సృష్టి నుండి ప్రసారం వరకు ఈ సీరియల్ ప్రయాణం అద్భుతం. ఈ కార్యక్రమం టెలివిజన్ లో ప్రదర్శితం అయినప్పుడు, ప్రతి ఇంటిలోనూ టీవీ ఉండేది కాదు. అయినప్పటికీ, ప్రతి ఆదివారం ఉదయం శ్రీరాముని దైవిక కార్యాలను వీక్షించడానికి ప్రజలు ఆ టైమ్ లో ఒకే దగ్గర గుమిగూడేవారు. వీధులు ఖాళీగా మారేవి. పండుగ వాతావరణం కంపించేది. “రామాయణం” ప్రభావం సాధారణ ప్రజలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది దేశ రాజకీయాలు, పరిపాలనపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. టాక్ ప్రకారం, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ “రామాయణం” కారణంగా తన ర్యాలీలలో ఒకదాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో రామానంద్ సాగర్ కుమారుడు ప్రేమ్ సాగర్, ఉత్తరప్రదేశ్లో రాజీవ్ గాంధీ ర్యాలీ ఆదివారం ఉదయం 9 గంటలకు జరగాల్సి ఉందని గుర్తుచేసుకున్నాడు. అయితే, “రామాయణం” అదే సమయంలో ప్రసారం అవుతుందని తెలుసుకున్న తర్వాత, ఆ సమయంలో ఎవరూ హాజరు కాలేరని నమ్మి ర్యాలీని రద్దు చేసుకున్నాడని సమాచారం.
రామాయణం పట్ల ఉన్న క్రేజ్ ఎంత తీవ్రంగా ఉండేదంటే దాని ప్రభావం రైల్వేలపై కూడా కనిపించింది. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ రైల్వే స్టేషన్లో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు రైళ్లు ఆలస్యంగా నడిచేవి. రైల్వే ఉద్యోగులు, ప్రయాణీకులు స్టేషన్లోని వెయిటింగ్ రూమ్లో టీవీలో కలిసి రామాయణం చూసేవారని వెల్లడైంది. ఆసక్తికరంగా ఆ టీవీని రైల్వే సిబ్బంది విరాళాల ద్వారా కొన్నారట.