ఒకే రోజు ఇద్దరు హరీశ్ను టార్గెట్ చేశారు. బీఆరెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకరు సీఎం రేవంత్రెడ్డి, మరొకరు కవిత. హరీశ్ను గుంటనక్క అని కవిత సంబోధించే అంశం అందరికీ తెలుసు. అతని పేరును ఆమె ఉచ్చరించడం లేదు. గుంటనక్కనే అని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. సీఎం నల్లగొండ సభ వేదికగా.. కవిత ఉప్పల్లో జరిగిన మీటింగులో హరీశ్ను టార్గెట్ చేశారు. బీఆరెస్పై విరుచుకుపడ్డారు.
మొదట కవిత మాటలను చెప్పుకుందాం. తెలంగాణ ఉద్యమంలో అవాకులు, చేవాకులు పేలిన వాళ్లకు పాలుపోసి పెంచుతున్నది బీఆర్ఎస్ లోని గుంటనక్కే అని హరీశ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కవిత. ఆంధ్రావాళ్లతో ఆయన పాలవ్యాపారం కారణంగానే తెలంగాణ అస్తిత్వంపై దాడి జరిగిన సరే బీఆర్ఎస్ మాట్లాడటం లేదన్నారు.
ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆంధ్రా ఆనకొండలు, కార్పొరేట్ శక్తులకు ఇప్పుడు పాలు పోసి పెంచుతున్నది బీఆర్ఎస్ లో ఉన్న గుంటనక్కే అని కవిత అన్నారు. నారాయణ, చైతన్య లాంటి కార్పొరేట్ విద్యాసంస్థలకు పాలు పోస్తున్న సంస్థ గుంటనక్కేదేనని చెప్పారు. అందుకే తెలంగాణపై ఎవరెవరో ఎన్ని మాటలు అంటున్న సరే బీఆర్ఎస్ మాట్లాడటం లేదన్నారు.
ఆ పార్టీకి తెలంగాణతో పేగు బంధం తెగిపోయిందన్నారు. ఈ ప్రాంతం హక్కులు, అస్తిత్వంపై టీఆర్ఎస్ మాత్రమే పోరాటం చేస్తుందని చెప్పారు. తెలంగాణలోని పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్, విద్యాసంస్థలకు ప్రభుత్వ డెయిరీ సంస్థల నుంచి పాలు సప్లయ్ అయ్యేలా ప్రభుత్వం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇక సీఎం రేవంత్ రెడ్డి.. హరీశ్ ఇజ్జత్ తీసేసినట్టుగా మాట్లాడారు. ఉద్యమం పేరుతో యువతను రెచ్చగొట్టి వారి ప్రాణాలు త్యాగం చేసుకునేలా చేశారని, హరీశ్రావు మాత్రం వంద రూపాయల పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టె దొరకలేదని ఆత్మాహుతి చేసుకోలేదని ఎద్దేవా చేశారు. బీఆరెస్ చేసినవి త్యాగాలు కాదని, ఆ త్యాగాల ముసుగులో భోగాలు అనుభవించారన్నారు.
ఉప ఎన్నికలను సృష్టిస్తూ.. ఎలెక్షన్, కలెక్షన్, సెలక్షన్గా ముందుకు పోయారని, అసలైన త్యాగాలు విద్యార్థులవన్నారు. కాళేశ్వరంను నిండా ముంచి గవర్నర్ కళ్లకు గంతలు కట్టి కాళేశ్వర్ రావు అని హరీశ్ పిలిపించుకున్నాడని, అదిప్పుడు కూలేశ్వరమై కూర్చున్నదన్నారు. మళ్లీ అధికారంలోకి తామే వస్తున్నామని, అంతా కేసీఆర్ రావాలంటున్నారని కేటీఆర్ అంటున్నారని, జనమెవరూ అలా అనుకోవడం లేదని, ఆ కుటుంబం మాత్రమే పగటికలలు కంటున్నదన్నారు.
నిన్న హరీశ్.. రేవంత్నుద్దేశించి కర్ణాటక పర్యటన గురించి నిలదీశారు. ఏమాత్రం నీటిపై అవగాహన లేని సీఎం.. ఉత్తమ్ కుమార్ను కూడా బయట కూర్చుండబెట్టి.. సమావేశంలో పాల్గొన్నాడని, తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందోనే అనుమానం తమకు ఉందన్నారు. సీఎంకు తెలంగాణ నీటి వనరుల విషయంలో కనీస అవగాహన లేదని విమర్శించారు.
తెలంగాణ నీటి హక్కులను కర్ణాటకకు దారాదత్తం చేసి వచ్చాడని ఆరోపించారు. దీంతో ఇవాళ రేవంత్.. హరీశ్ను టార్గెట్ చేశారు. అంతకు ముందు తాటిచెట్టు అని, బిళ్లారంగా అని నిక్నేమ్లు పెట్టిన రేవంత్.. ఇవాళ అగ్గిపెట్టె అని ఉద్యమ కాలం నాటి పరిస్థితులు వివరించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.