ఆయనను చేసినంత ట్రోలింగ్ ఎవరినీ చేసి ఉండరు. దేశంలోనే అత్యధికంగా ట్రోలింగులకు గురైన వ్యక్తుల్లో నారా లోకేశ్ రెండోవాడు. ఇది స్వయంగా ఆయనే తాజాగా ఓ ఇంటర్వూలో చెప్పాడు. పప్పు.. పప్పు అని అతన్ని తెగ ట్రోల్ చేసేవారు. స్పష్టత లేని తెలుగు.. తడబడే మాటలపై కూడా ఆడుకున్నారు. తీయగుంది.. అని లోకేశ్ అన్న మాటలను జోక్లకు విరివిగా వాడుకున్నారు. .మీమర్స్కు ఓ పావుగా మారాడు అప్పుడు లోకేశ్.
కానీ ఇప్పుడు అలా కాదు. చాలా కొద్ది కాలానికే అతని ఆహార్యంలోనే కాదు.. ఉచ్చరణలో, వ్యవహార శైలిలో బాగా మార్పు వచ్చింది. రాజకీయంగా పరిణతి కనబరుస్తున్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజుల్లో రెడ్ బుక్ అంటూ బెదిరింపు దోరణిలో మాట్లాడినా..ఇప్పుడు అట్లాంటి కామెంట్స్ ఆయన నుంచి రావడం లేదు. అలా బెదిరిస్తే తప్ప.. వైఎస్సార్ సీపీ లాంటి పార్టీ నేతలకు బుల్లెట్ దించినట్టుగా ఉండదు అని భావించి అలా అని ఉంటాడు.
సరే, ఇదంతా ఒక్క లెక్కైతే.. తాజాగా ఆయన ఓ మీటింగులో చెప్పిన మాటలు.. చాలా ఆసక్తిగా ఉన్నాయి. అందరికీ ఆకట్టుకున్నాయి. ఆయనలోని పరిపక్వత ఏపాటిదో ఆ మాటలు పట్టించాయి. లోకేశ్ ఏమన్నాడు? సంక్షేమం, అభివృద్ధి వేరు.. గెలవటం వేరు అన్నాడాయన. చాలా అభివృద్ధి చేసినా జనం ఓడగొడతారు..? ఎందుకో తెలుసా? అని టీడీపీ నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు.
తమిళనాడులో డీఎంకే కూడా చాలా అభివృద్ది చేసింది మరి ఎందుకు ఓడిపోయింది? ఏపీ ప్రజలు ఎన్టీయార్నూ ఓడించారు గుర్తుందా? చంద్రబాబూ ఓడిపోయాడు తెలుసు కదా? ఎందుకు?? అని నాయకులను అడిగాడు. ఎవరూ స్పందించలేదు. ఆయనే చెప్పాడు. ఎప్పుడైతే ఎన్నికల్లో ఓ పార్టీ ఓడిందో.. వారు జనానికి దూరమయ్యారని అర్థం చేసుకోవాలని.
అంటే నేల విడిచి సాము చేసినట్టుగా భావించాలట. లీడర్ను ఎన్నుకున్నది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు తగినంత సంఖ్యాబలం ఇచ్చింది.. ప్రజలతో మేమకమవ్వడానికి. వారికి ఏం కావాలో తెలుసుకోవడానికి. వారికి అందుబాటులో ఉండటానికి. ఇవన్నీ లేనప్పుడు.. పాటించనప్పుడు..వారితో సంబంధాలు తెగిపోయినప్పుడు…. ఇక ఆ పార్టీ, ఆ లీడర్ అక్కడ చెల్లుబాటు కాడని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా వివరించాడు లోకేశ్.
ఈ టాపిక్ ఇప్పుడు తెలంగాణకు కూడా అన్వయించుకోవచ్చు. ఎందుకంటే.. ఇక్కడ కేటీఆర్.. పదే పదే తన మీటింగులలో తమ ఓటమికి కారణం ప్రజలనే విధంగా , వారిని నిందించి, నిలదీసి.. దోషులుగా నిలబెట్టేందుకు నిత్యం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత తేడా ఇద్దరిలో.
వాస్తవానికి, రాజకీయాల్లో కేటీఆర్ కన్నా లోకేశ్ జూనియర్. కేటీఆర్కున్న అనుభవం లేదు. భాష పట్ల స్పష్టతా లేదు. అనర్గళంగా మాట్లాడే నైజమూ కాదు. కానీ అంతకుమించి లోకేశ్కు రాజకీయ పరిణతి, పరిజ్ఞానం ఉందని తాజా సంఘటనతో తేలిపోయింది. ఇదిప్పుడు వైరల్ అవుతోంది. అంతిమంగా లోకేశ్ తమ నాయకులకు చెబుతున్నదేంటో తెలుసా? మీరు ఒక్క చంద్రబాబు మీదో.. లోకేశ్ మీదో భారం వేసి హాయిగా రెస్ట్ తీసుకోవద్దు. జనంతో ఉండండి. జనంతో సంబంధాలు కట్ అయిన రోజున మనం చెల్లని రూపాయినే అని అన్నాడు.
అంటే ఓటమి తప్పదని హెచ్చిరించాడు. ఇక్కడ రామన్న మాత్రం..మీరు బేఫికర్ ఉండండి.. జనం గెలిపిస్తారు.. ఈసారి కూడా ఓడగొడితే అంతకు మించిన తప్పు వేరొకటి ఉండదు.. స్కీమ్లన్నీ ఆన్లైన్ చేసి మీ పాత్ర లేకుండా చేశాం.. మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఏం చేయాలో అది చేస్తామంటూ.. బీఆరెస్ కార్యకర్తలను ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నాడు.
ఇద్దరిలో అదీ తేడా! ఇద్దరూ ముఖ్యమంత్రి పదవి కోసం ఉవ్విళ్లూరుతున్నవారే..! దీన్ని బట్టి ఎవరి రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందో.. వారే చెప్పకనే చెప్పుకుంటున్నారిలా!