అంతా మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. అందరూ స్వాగతిస్తున్నారు. ఇక వచ్చే సాధారణ ఎన్నికల నాటికి బిల్లు కూడా ఆమోదం పొంది 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయనే భావిస్తున్నారు. ఇక మహిళలు రాజకీయంగా అవకాశాలు పెరిగి, పురుషులతో పోటీగా చట్టసభల్లో రాణిస్తారని అంతా అనుకుంటున్న వేళ.. టీఆరెస్ చీఫ్ కవిత ఓ కొత్త విషయం వెలుగులోకి తెచ్చారు.
అసలు రాజకీయంగా చైతన్యం ఉండి.. ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఎవరూ లేరని. చాలా తక్కువ మంది ఉన్నారని. వారిని అలా ఎదగనీయకుండా చేసింది పురుషాధిక్య సమాజమేనని. బీసీల్లో, మైనార్టీలలో అసలు మహిళా అభ్యర్థులే దొరకని స్థితి ఉంటుందని. మైనార్టీలోనైతే ఒక్కరంటే ఒక్కరు కూడా లేరని.
ఆమె చెప్పిన ఈ విషయాలు చాలా మంది ఆశ్చర్యపరిచాయి. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవం అదే. అందుకే ఆమె అంటున్నారు.. మహిళా బిల్లుతో సంబంధం లేకుండా.. తన పార్టీ టీఆరెస్ ద్వారా.. 33 శాతానికి తగ్గకుండా మహిళలకు టికెట్లు ఇస్తానని. ఇది వరకు కూడా ఆమె ఈ విషయం ప్రకటించి ఉన్నారు. ఎన్సీఆర్డబ్ల్యూ ఆధ్వర్యంలో జరిగిన చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు.. సాధన సభకు హాజరైన ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
తన పార్టీ స్టాండ్ను ఈ వేదికగా మరోమారు ప్రకటించారు. టీఆరెస్ నుంచి 50 శాతం వరకు మహిళలకు టికెట్లు ఇవ్వడానికి కూడా సిద్దమేనని, కానీ అంత మంది మహిళలు రావడం కష్టమేనని ఆమె ఫీల్డ్ రియాలిటీని చెప్పారు. ఈ 33 శాతానికైతే తగ్గకుండా తమ పార్టీ టికెట్లు ఇస్తుందన్నారు. అయితే మహిళలు కనీసం బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేరన్నారు. అందుకే తాము.. తమ పార్టీ వేదికగా మహిళా అభ్యర్థులను వెతుకుతామని వారిని గుర్తించి. వారిని రాజకీయాల్లోకి వచ్చేలా ప్రోత్సహిస్తామన్నారు. ఆ తరువాత వారికి రాజకీయాలపై అవగాహన పెంచేలా అవసరమైతే శిక్షణినిచ్చి టికెట్లిస్తామన్నారు. వారిని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
అయితే తాము 33 శాతానికి కట్టుబడి టికెట్లిచ్చినా.. ఇతర పార్టీలు కూడా ఒకవేళ 33 శాతం మహిళలకు టికెట్లిచ్చినామని చెప్పుకున్నా.. ఒకే నియోజకవర్గంలో అంతరూ మహిళలుండరు కాబట్టి.. మిగిలిన పురుష అభ్యర్థులు, మహిళా అభ్యర్థిని ఓడిస్తారని, దీని వల్ల అనుకున్న ప్రయోజనం చేకూరదన్నారు.
అందుకే చట్టపరంగా నియోజకవర్గాల రిజర్వేషన్లు కేటాయించినప్పుడే అందరూ అక్కడ మహిళలు పోటీ చేసే అవకాశం ఉంటుందన్నారు. మహిళా బిల్లులో బీసీ సబ్ కోటా అనే డిమాండ్ ఉందని, కానీ బీసీలకే రిజర్వేషన్ లేనప్పుడు.. ఇక బీసీ సబ్ కోటా ఎలా సాధ్యమవుతుందనే టెక్నికల్ పాయింట్ను ఆమె లేవనెత్తారు. దీనిపైన పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
ఓ మహిళగా సొంతంగా పార్టీ పెట్టి ధైర్యంగా ముందడుగు వేశానని, దేశం మొత్తం తలెత్తుకుని చూసేలా మహిళా లోకం గర్వపడేలా ఓ మంచి రాజకీయ వాతావరణాన్ని, పాలనను అందిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.