Cooling Paint: సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో సీజన్ మారినా ఇంట్లో వేడి మాత్రం తగ్గదు. దీని కోసం చాలామంది ఏసీలను విపరీతంగా వాడుతుంటారు. అయితే కరెంట్ అవసరం లేకుండానే ఇళ్లను చల్లగా ఉంచే ‘పాసివ్ రేడియేటివ్ కూలింగ్’ సాంకేతికతపై శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి కూలింగ్ పెయింట్లు కేవలం తెలుపు రంగులోనే అందుబాటులో ఉంటాయి. కానీ, అందరికీ ఇళ్లకు తెల్ల రంగు వేసుకోవడం నచ్చకపోవచ్చు. రంగులు మారిస్తే అవి వేడిని ఎక్కువగా పీల్చుకుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగానే శాస్త్రవేత్తలు సరికొత్త రంగుల పెయింట్ను కనిపెట్టారు.
‘నేచర్ ఎనర్జీ’ జర్నల్లో ప్రచురితమైన తాజా పరిశోధన ప్రకారం.. శాస్త్రవేత్తలు బయోమాస్ (సహజ వ్యర్థాల) ఆధారిత ‘ఇథైల్ సెల్యులోజ్’ అనే పదార్థంతో ఒక ప్రత్యేకమైన కోటింగ్ను తయారు చేశారు. ఇది సాధారణ పెయింట్లానే రంగురంగుల్లో ఉంటుంది. కానీ ఎండను ఏమాత్రం లోపలికి రానివ్వదు. ఈ పెయింట్ సూర్యరశ్మిని దాదాపు 97 శాతం వరకు ప్రతిబింబిస్తుంది. దీనివల్ల తీవ్రమైన ఎండలో కూడా భవనాల ఉపరితలం చుట్టుపక్కల వాతావరణం కంటే దాదాపు 9 డిగ్రీల సెల్సియస్ (16 డిగ్రీల ఫారెన్హీట్) వరకు చల్లగా ఉంటుంది.
Also Read: ఒప్పో షాకింగ్ నిర్ణయం.. ఆ ప్రీమియం ఫోన్పై ఏకంగా రూ.64,000 తగ్గింపు, ఎక్కడ కొనుగోలు చేయాలంటే?
సాధారణ పెయింట్స్లో రంగు కోసం పిగ్మెంట్స్ (రసాయన రంగులు) వాడతారు. ఇవి కాంతిని పీల్చుకుని వేడిని పుట్టిస్తాయి. కానీ ఈ కొత్త టెక్నాలజీలో ఎలాంటి పిగ్మెంట్స్ వాడలేదు. సబ్బు బుడగలు లేదా సీతాకోకచిలుక రెక్కలు కాంతి పరావర్తనం వల్ల రంగురంగులుగా ఎలా మెరుస్తాయో, ఈ పెయింట్ కూడా అలాగే పనిచేస్తుంది. దీన్ని గోడపై వేసినప్పుడు అది ఆరిపోయే క్రమంలో స్వయంచాలకంగా రెండు పొరలుగా విడిపోతుంది. పైపొర రంగును ఇస్తే, లోపలి రంధ్రాల వంటి నిర్మాణం ఉన్న పొర వేడిని బయటకు నెట్టేసి బిల్డింగ్ను చల్లబరుస్తుంది.
ల్యాబ్లోనే కాకుండా హాంకాంగ్ వంటి అత్యధిక ఉక్కపోత, తేమ (హ్యుమిడిటీ) ఉన్న ప్రాంతాల్లో ఈ పెయింట్ను క్షేత్రస్థాయిలో పరీక్షించారు. సాధారణంగా తేమ ఎక్కువగా ఉన్నచోట ఇలాంటి కూలింగ్ టెక్నాలజీలు సరిగా పనిచేయవు. కానీ, ఈ కొత్త కోటింగ్ మార్కెట్లో ఉన్న మిగతా రంగుల పెయింట్ల కంటే మెరుగైన ఫలితాలను ఇచ్చింది. ఉక్కపోత ఎక్కువగా ఉండే నగరాల్లోని భవనాలకు ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. బిల్డర్లు, ఇళ్ల యజమానులు తమకు నచ్చిన రంగులను ఎంచుకుంటూనే ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది.
గతంలో కూడా సెల్యులోజ్ ఆధారిత కూలింగ్ విధానాలు ఉన్నప్పటికీ.. వాటి తయారీ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉండేది. కానీ ఈ కొత్త పద్ధతిలో కేవలం ఒకే ఒక్క స్టెప్లో ఈ కోటింగ్ను సులభంగా తయారు చేయవచ్చు. దీనివల్ల కంపెనీలు దీనిని మార్కెట్లోకి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం సులువు అవుతుంది. ఇది ఏసీల వాడకాన్ని పూర్తిగా భర్తీ చేయలేకపోయినా, వేసవిలో విద్యుత్ వినియోగాన్ని, బిల్లులను గణనీయంగా తగ్గిస్తుంది. పర్యావరణానికి హాని చేయకుండా ఇళ్లను అందంగా, చల్లగా ఉంచుకోవడానికి ఇదొక గొప్ప ముందడుగు.
Also Read: మునుపెన్నడూ లేని బిగ్ స్క్రీన్తో ఎంట్రీ ఇవ్వనున్న iQOO 16T.. లీకైన పూర్తి వివరాలు ఇవే!