Ambiator Cooling: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. దీంతో భానుడి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఏసీలు, కూలర్లపై ఆధారపడుతున్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి మరీ.. వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే వీటితో సంబంధం లేకుండానే ఇంటిని చల్లగా ఉంచుకునే సరికొత్త టెక్నాలజీ హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చింది. నగరానికి చెందిన స్టార్టప్ కంపెనీ ‘అంబియేటర్’ (Ambiator) ఈ అద్భుతాన్ని చేసి చూపించింది. 45°C పైబడిన ఉష్ణోగ్రతల్లోనూ చల్లగా ఉంచే క్రేజీ సాంకేతికతకు రూపకల్పన చేసింది. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, పాఠశాలలు, సామాన్యులకు తక్కువ ఖర్చుతో ఎండల నుంచి ఉపశమనం కలిగించే లక్ష్యంతో దీనిని తీసుకొచ్చినట్లు సదరు స్టార్టప్ పేర్కొంది.
సాధారణ ఏసీలు గాలిలోని తేమను తీసేసి గదిని పొడిగా మారుస్తాయి. కానీ స్టార్టప్ ప్రవేశపెట్టిన సరికొత్త అంబియేటర్ సిస్టమ్ (Ambiator System).. ఇందుకు భిన్నంగా పనిచేస్తుంది. ఇది మట్టికుండ ఫార్మూలా ఆధారంగా వర్క్ చేస్తుంది. దీనిలో ఎలాంటి కంప్రెసర్లు, హానికరమైన గ్యాస్ లు (Refrigerants) ఉండవని కంపెనీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బయట 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ.. లోపలి గాలిని 24-28 డిగ్రీల వరకూ తగ్గిస్తుందని పేర్కొంటున్నాయి. ఈ అంబియేటర్ సిస్టమ్.. బయటి నుంచి ఫ్రెష్ గాలిని ఎప్పటికప్పుడు లోపలికి పంపించడం వల్ల.. ఏసీ గదుల్లో గాలి నాణ్యత సమస్య ఉండదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
సాధారణంగా 5 టన్ ఏసీకి అవసరమయ్యే విద్యుత్ కంటే ఇది 80 శాతం తక్కువ పవర్ నే వినియోగిస్తుందని స్టార్టప్ కంపెనీ చెబుతోంది. కేవలం ఒక కిలోవాట్ పవర్ తోనే అంబియేటర్ కూలింగ్ సిస్టమ్ పనిచేస్తుందని పేర్కొంది. ఏసీలతో పోలిస్తే.. దీని నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువేనని అంటోంది. సోలార్ విద్యుత్ తో నడిచే వెసులుబాటు కూడా దీనికి ఉండటం వల్ల.. విద్యుత్ భారం కూడా వినియోగదారులపై పడదని పేర్కొంటోంది.
సాధారణంగా ఏసీలు నుంచి విడుదలయ్యే వేడి గాలి, వాటిలో వాడే రిఫ్రిజరెంట్ వాయువులు పర్యవరణానికి నష్టం కలిగిస్తుంటాయి. ఇవి కార్బన్ డై ఆక్సైడ్ కంటే ఎక్కువ వేడిని సృష్టిస్తున్నాయని పర్యావరణ వేత్తలు ఎంతో కాలంగా పేర్కొంటూ వస్తున్నారు. అయితే ఈ అంబియేటర్ కూలింగ్ టెక్నాలజీ ద్వారా ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఏడాదికి దాదాపు 25,000 కిలోల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని ఈ స్టార్టప్ వ్యవస్థాపకులు టైగర్ ఆస్టర్, జీతన్ దేశాయ్ పేర్కొన్నారు.
Also Read: 3D కూలింగ్తో వచ్చేసిన.. అత్యాధునిక కదిలే ఏసీ.. వామ్మో ఇది మాముల్గా లేదుగా!
ప్రస్తుతం ఈ అంబియేటర్ టెక్నాలజీ చాలా ప్రాంతాల్లో విజయవంతంగా పనిచేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్తో పాటు బెంగళూరు, దిల్లీ, పుణె వంటి 8 నగరాల్లో ఫ్యాక్టరీలు, ఆఫీసులు, ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో సుమారు 35 పైగా యూనిట్లను ఏర్పాటు చేశారు. భారీ ఏసీ బిల్లులు భరించలేని మధ్యతరగతి కుటుంబాలు, చిన్న తరహా పరిశ్రమలకు ఇది ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా నిలుస్తోందని కంపెనీ వ్యవస్థాపకులు టైగర్ ఆస్టర్, జీతన్ దేశాయ్ పేర్కొంటున్నారు.
Also Read: Flipkart Offers: ఏంది మామ ఇది.. Carrier 1.5 Ton ఏసీ.. ఇంత చౌకగా ఇచ్చేస్తున్నారు!