Gannavaram: కన్నతల్లి ఒడి అంటే ఆ పసిపాపకు కొండంత అండ.. అమ్మే తోడుంటే తనకు లోకంతో పనిలేదనుకుంది ఆ 18 నెలల చిన్నారి. కానీ, అదే అమ్మ తన స్వార్థం కోసం, అక్రమ సంబంధం కోసం ఆ పసి ప్రాణాన్ని బలిపీఠం ఎక్కిస్తుందని ఆ చిన్నారి ఊహించలేకపోయింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఒక తల్లి, క్రూరత్వమే రూపంగా మారిన ఆమె ప్రియుడు కలిసి ఒక నిండు ప్రాణాన్ని గాలిలో కలిపేశారు. విజయవాడ సమీపంలోని గన్నవరంలో జరిగిన ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది.
గన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్న ఒక దంపతులు తమ ఐదేళ్ల కుమారుడు, 18 నెలల కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. అయితే, సదరు మహిళ తన భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన పుట్టింటికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి, ప్రియుడితో కలిసి నివసించేందుకు స్థానికంగా ఒక గదిని కూడా అద్దెకు తీసుకుంది. ఈ క్రమంలోనే ఒకరోజు తన చిన్నారిని తీసుకుని ఆమె ప్రియుడి వద్దకు వెళ్ళింది.
అక్కడ గదిలో వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో, ఆ కోపాన్ని పసికందుపై చూపించాడు ప్రియుడు. తమ సంబంధానికి అడ్డుగా ఉందన్న క్రూరమైన ఆలోచనతో ఆ చిన్నారిని గోడకేసి కొట్టాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక ఆ పసిపాప అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. బిడ్డ చనిపోవడంతో భయపడిపోయిన ఆ మహిళ, తన అత్తమామలకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వారు ఎక్కడున్నావని ఆరా తీయగా, ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది.
వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు విజయవాడ పరిసరాల్లో గాలిస్తుండగా, చుట్టుగుంట ప్రాంతంలో చనిపోయిన పాపతో ఉన్న మహిళను, ఆమె ప్రియుడిని గుర్తించారు. వెంటనే వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు నేరచరిత్ర కలవాడని, గతంలో పోక్సో కేసులో జైలుకు వెళ్లడమే కాకుండా అతనిపై మరికొన్ని కేసులు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. కనిపెంచాల్సిన తల్లి కళ్లముందే, కన్న బిడ్డను ప్రియుడు కిరాతకంగా చంపడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Also Read: తాండూరులో కలకలం.. కూతురి ప్రేమను విడగొట్టేందుకు తల్లి ‘క్షుద్రపూజలు’