Dating App Scams: తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. కొత్త కొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సైబర్ నేరస్తులు.. ఫ్రెండ్ షిప్, డేటింగ్ యాప్స్ పేరుతో యువతకు వల విసురుతున్నారు. ఒంటరి యువకులను లక్ష్యంగా చేసుకొని అందమైన అమ్మాయిల పేరుతో నిలువునా దోచేస్తున్నారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా మోసాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో డేటింగ్ యాప్స్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.
ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వాడుతున్న సమయంలో డేటింగ్ యాప్స్ పేరుతో కొన్ని ప్రకటనలను చూసే ఉంటారు. ఓ అందమైన అమ్మాయితో స్నేహం లేదా డేటింగ్ చేయాలంటే ఈ యాప్ మీ దగ్గర ఉండాల్సిందే? అంటూ ఆ ప్రకటనలు ఊదరగొడుతుంటాయి. ఏమాత్రం కక్కుర్తి పడి వారు సూచించిన యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారో.. అక్కడి నుంచే అసలైన స్కామ్ మెుదలవుతుంది.
ఫ్రెండ్ షిప్ లేదా డేటింగ్ యాప్ ను ఉపయోగించి.. అమ్మాయితో మాట్లాడాలంటే నిర్ధిష్ట సమయానికి రూ.16-50 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. అది చెల్లించగానే అవతలివైపు నుంచి ఒక అందమైన ప్రొఫైల్ తో యువతి మీతో చాటింగ్ చేయడం ప్రారంభిస్తుంది. మీ కోరికలను రెచ్చగొట్టే విధంగా ఆమె మెసేజ్ లు ఉంటాయి. తర్వాతి స్టెప్ లో భాగంగా మీతో ఆన్ లైన్ కాల్ ఆమె మాట్లాడుతుంది. లేడీస్ వాయిస్ తో అవతలి నుంచి మాట్లాడుతూ మీతో మాట్లాడేది అమ్మాయే అన్న నమ్మకాన్ని కలిగిస్తుంది.
ఫోన్ కాల్ ద్వారా వ్యక్తిగత విషయాలు అన్ని సేకరించిన అనంతరం.. అవతలి వైపు అమ్మాయి వీడియో కాల్ ను ఆఫర్ చేస్తుంది. మీరు ఏ మాత్రం ఈ విషయంలో తొందరపడినా.. తిరిగి వెనక్కిరాలేనంత ఇబ్బందుల్లోకి వెళ్లిపోతారు. మీరు చేసిన నగ్న వీడియో కాల్స్ ను రికార్డ్ చేసి.. మిమ్మల్ని బెదిరించడం స్టార్ట్ చేస్తారు. అప్పటికే యాప్ డౌన్ లోడ్ సందర్భంగా మీరు ఇచ్చిన అన్ని పర్మిషన్లతో మీ ఫోన్ లోని కాంటాక్ట్ నెంబర్లకు వారికి యాక్సెస్ లభిస్తుంది. దీంతో మీ వీడియోను స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులకు షేర్ చేస్తామని బెదిరించడం మెుదలుపెడతారు. ఇలా వారి ఉచ్చులో చిక్కుకొని యువత డబ్బులు పోగొట్టుకుంటున్న ఘటనలో ఇటీవల బాగా పెరిగిపోయాయి.
Also Read: తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే.. మీరేం ప్రశ్నించరా? బీజేపీ ఎంపీలపై హరీశ్ రావు ఫైర్
డేటింగ్ యాప్స్ పేరిట జరుగుతున్న ఈ మోసాలపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్.. గత నెలలో యువతను అప్రమత్తం చేశారు. రాత్రిపూట అందమైన అమ్మాయిలు, ఆంటీలతో మాట్లాడండి అంటూ వస్తున్న ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలా మాట్లాడేవారు నిజమైన మహిళలు కాదని వెల్లడించారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి మహిళలు మాట్లాడుతున్నట్లుగా వీడియోలు చేసి.. యువతను బుట్టలో వేస్తున్నారని, తద్వారా డబ్బులు దోచుకుంటున్నారని హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి సైబర్ వలలో చిక్కుకుంటే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని సూచించారు.
Also Read: Meta layoffs: మెటా షాకింగ్ నిర్ణయం.. ఒక్కరోజులో 8,000 మంది ఉద్యోగుల తొలగింపు..!