Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాట్లాడిన మాటలు చూసి తెలంగాణ ప్రజల గుండెలు రగిలిపోతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు అన్నారు. బీజేపీ తక్షణమే తేజస్వి వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ మనోభావాలను దెబ్బతీసిన పార్టీగా బీజేపీ మిగిలిపోతుందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతిస్తుంటే.. ప్రశ్నించాల్సిన బాధ్యత మీపై లేదా అంటూ రాష్ట్ర బీజేపీ ఎంపీలను హరీశ్ రావు ప్రశ్నించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి.. ఈ నెల 20న బీఆర్ఎస్ లో చేరనున్న నేపథ్యంలో కేటీఆర్, హరీశ్ రావు జగిత్యాలలో పర్యటించారు. ఇందుకు సంబంధించి బహిరంగ సభ ఏర్పాట్లను వారు పరిశీలించారు. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి చేరిక కరీంనగర్ జిల్లాకే కాకుండా యావత్ ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కు బలాన్ని పెంచుతుందని అన్నారు. ‘రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి’ అని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని.. ఇందుకు జీవన్ రెడ్డి చేరికే సజీవ సాక్ష్యమన్నారు.
మరోవైపు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీయడమేని హరీశ్ రావు అన్నారు. ఇందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆ వ్యాఖ్యలను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారన్ని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తారా? ప్రశ్నించారు. కనీస అవగాహన లేకుండా తెలంగాణపై, ఉద్యమంపై బీజేపీ నేతలు విషం చిమ్ముతున్నారని విమర్శించారు.
Also Read: రాహుల్ గాంధీ చెప్పిందే జరిగింది.. మహిళా బిల్లుపై కేంద్రం తప్పటడుగు ఎక్కడ వేసింది?
ఒక ఎంపీ తప్పు మాట్లాడితే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దాన్ని ఖండించాల్సింది పోయి సమర్థించడం దారుణమని హరీశ్ రావు అన్నారు. బీజేపీ తక్షణమే తేజస్వి వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే తెలంగాణ మనోభావాలను దెబ్బతీసిన పార్టీగా బీజేపీ మిగిలిపోతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉండి ఉంటే తేజస్వికి తెలంగాణ బిడ్డల తరఫున దీటైన, మూతి పగిలే సమాధానం చెప్పేవాళ్లని హరీశ్ రావు అన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా మౌనంగా కూర్చున్నారని విమర్శించారు.