Google AI Smart Glasses: ఏఐ టెక్నాలజీతో రూపొందిన వినియోగదారుల హార్డ్వేర్ మార్కెట్ వేగంగా ఎదుగుతున్న విషయం తెలిసిందే. ఈ రంగంలో టాప్ స్థాయిలో ఉన్న మెటాకు పోటీగా గూగుల్ కూడా రంగంలోకి దిగుతోంది. జెమిని ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ను 2026 నాటికి విడుదల చేయనున్నట్లు ఇటీవల గూగుల్ ప్రకటించింది. ఈ గ్లాసెస్ అభివృద్ధి కోసం శామ్సంగ్, జెంటిల్ మాన్స్టర్, వార్బీ పార్కర్ సంస్థలతో భాగస్వామ్యం అవుతున్న గూగుల్, వాటిని పిక్సెల్ బ్రాండ్ కింద కాకుండా, గతంలో పాటించిన భాగస్వామ్య విధానాన్నే కొనసాగించడానికి సిద్ధమైందని సమాచారం.
గూగుల్ ఈ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్ను ఒక భవిష్యత్ ప్రణాళికతో చేరుకుంటోంది. అందుకే వారు రెండు రకాల ఉత్పత్తులను ఒకేసారి అభివృద్ధి చేస్తున్నారు.
మొదటి రకం గ్లాసెస్
ఇందులో మొదటి రకం గ్లాసెస్ కేవలం ఆడియో-ఓన్లీ, తేలికైన, స్క్రీన్-రహిత పరికరాలుగా ఉంటాయి. వీటిలో అంతర్నిర్మిత స్పీకర్లు, మైక్రోఫోన్లు, కెమెరాలు ఉంటాయి. ఇవి బేస్లైన్ మెటా రే-బాన్ ఏఐ గ్లాసెస్కు సమానంగా ఉంటాయి. ఈ గ్లాసెస్ ద్వారా వినియోగదారులు గూగుల్ యొక్క ఏఐ అసిస్టెంట్ అయిన జెమినిని యాక్సెస్ చేయవచ్చు, ప్రశ్నలు అడగవచ్చు, తక్షణ సమాధానాలు పొందవచ్చు.
రెండవ రకం గ్లాసెస్
రెండవ రకం గ్లాసెస్ విషయానికి వస్తే, వీటిలో హెడ్స్-అప్ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే నావిగేషన్, భాష అనువాదాలు (Language translations) వంటి సమాచారాన్ని కళ్ళ ముందు చూపించగలదు. ఈ డిస్ప్లే కలిగిన గ్లాసెస్ మొదటి వెర్షన్ వచ్చే ఏడాది 2026లో అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. అయితే దాని వివరాలు ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు.
డిజిటల్ అసిస్టెంట్
మెటా తీసుకొచ్చిన రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ విజయం, ఏఐ స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్కు ఒక స్పష్టమైన దిశను చూపించింది. దీనివల్ల ఈ సెగ్మెంట్పై వినియోగదారుల ఆసక్తి పెరిగింది. టెక్ కంపెనీలు ఊహించిన పూర్తి స్థాయి నిజ ప్రపంచంపై డిజిటల్ సమాచారం జత చేసే పరికరాలకు ఇవి ఇంకా దూరంగానే ఉన్నప్పటికీ, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే డిజిటల్ అసిస్టెంట్లాగా ఈ గ్లాసెస్ పనిచేస్తున్నాయి. ఐ-వేర్ రంగంలోని దిగ్గజ సంస్థ ఎస్సిలార్ లక్సోటికాతో కలిసి మెటా అభివృద్ధి చేసిన రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్లో కీలక స్థానం సంపాదించాయి.
ఇండియాలో ధర రూ.66,000
2023 అక్టోబర్లో రెండవ తరం రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ విడుదలైనప్పటి నుంచి వీటి అమ్మకాలు వేగంగా పెరిగాయి. ఇప్పటివరకు రెండు మిలియన్ యూనిట్లకు పైగా గ్లాసెస్ అమ్ముడయ్యాయని అంచనా. 2025 ఏడాదిలో ఏప్రిల్ నెల నుంచి జూన్ నెల మధ్యాకాలంలో అమ్మకాలు మూడు రెట్లు పెరగడం గమనార్హం. తాజాగా మెటా లోపలే అమర్చిన డిస్ప్లేతో కూడిన రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ను 799 డాలర్ల ధరకు పరిచయం చేసింది. ఇది ఇండియా ధరలో సుమారు 66,000 రూపాయలకు పైగా ఉండనుందని అంచనా. అయితే ఈ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ సెగ్మెంట్ ఇప్పటికీ చిన్న మార్కెట్గానే కొనసాగుతోంది. ఈ గ్లాసెస్ ద్వారా వచ్చే ఆదాయం, యాపిల్ ఐఫోన్ ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంది.
భవిష్యత్తులో స్మార్ట్ఫోన్ ఏఐ
టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, తదుపరి పెద్ద టెక్ ట్రెండ్ స్మార్ట్ గ్లాసెస్సే. వీటిని ధరించి, మాట్లాడటం లేదా చూడటం ద్వారా ఆపరేట్ చేయవచ్చు. ఇవి భవిష్యత్తులో స్మార్ట్ఫోన్లను పూర్తిగా భర్తీ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. రోజుమంతా ధరించడానికి వీలుగా స్టైలిష్గా, తేలికగా, ఫ్యాషన్గా ఉండే స్మార్ట్ గ్లాసెస్ను తయారు చేయడానికి సిలికాన్ వ్యాలీలో ప్రస్తుతం పెద్ద పోటీ నడుస్తోంది. మెటా తరువాత, గూగుల్ తమ సాఫ్ట్వేర్ తమ అనుభవాన్ని ఆధారంగా చేసుకుని స్మార్ట్ గ్లాసెస్ను భవిష్యత్తులో మన డివైజ్లతో ఇంటరాక్ట్ అయ్యే డిఫాల్ట్ మార్గంగా మార్చాలని చూస్తోంది. అయినప్పటికీ, ఈ గ్లాసెస్ ఇంకా స్మార్ట్ఫోన్ల పూర్తి స్థాయి అభివృద్ధి అందుకోవడానికి సమయం పడుతుంది, ప్రస్తుత ఏఐ ఫీచర్లు ఇంకా పూర్తిస్థాయిలో ఉపయోగంగా లేవనే అభిప్రాయం ఉంది. ఈలోగా, యాపిల్ కూడా మెటా యొక్క స్క్రీన్-ఫ్రీ ఏఐ గ్లాసెస్లాంటి మొదటి మోడల్ను 2026 లేదా 2027లో విడుదల చేయవచ్చనే వార్తలు వస్తున్నాయి.
మిక్స్డ్-రియాలిటీ హెడ్సెట్
గతంలో గూగుల్ ‘గూగుల్ గ్లాస్’ తో అనుకూల ఫలితాలు రాకపోవడం, కంపెనీ యొక్క కొత్త గ్లాసెస్ హెడ్సెట్ల కోసం రూపొందించబడిన గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ (Android XR) పై ఆధారపడి ఉంటాయి. గూగుల్ ఇటీవల ఎక్స్రియల్తో కలిసి అభివృద్ధి చేసిన ప్రాజెక్ట్ ఆరాను కూడా ప్రదర్శించింది. ఇది ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ యాప్లను పూర్తి మిక్స్డ్-రియాలిటీ హెడ్సెట్లా అమలు చేయగలదు. ఈ కొత్త ప్లాట్ఫారమ్ గూగుల్ ఏఐ గ్లాసెస్ విజయానికి కీలకమవుతుందని భావిస్తున్నారు.